తెలంగాణాలో ట్రంప్ వీరాభిమాని హంగామా... గెలుపుతో సెలబ్రేషన్స్!
ఎంతో ఉత్కంఠతో సాగిన యూఎస్ ఎన్నికలలో ఎట్టకేలకు ట్రంప్ విజయ దుందుభి మ్రోగించారు. దీంతో ట్రంప్ అభిమానుల సంబరాలు జోరుగా సాగుతున్నాయి. యూఎస్ లోనే కాదు, ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో ట్రంప్ విజయం సాధించిన నేపధ్యంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. భారత్ యూఎస్ ల మధ్య సంబంధాలపై కూడా జోరుగా చర్చ సాగుతుంది.
ట్రంప్ విజయం పట్ల ఆయన వీరాభిమాని హంగామా
ఇక ఇదే సమయంలో తెలంగాణా రాష్ట్రంలో ట్రంప్ విజయం పట్ల ఆయన వీరాభిమాని హంగామా చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ట్రంప్ విజయోత్సవ సంబరాలను ఘనంగా జరుపుతున్నారు. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన జనగం ఉదయకిరణ్ డోనాల్డ్ ట్రంప్ కు వీరాభిమాని. అతను చాలా కాలంగా ట్రంప్ పుట్టినరోజు వేడుకలతో పాటు ట్రంప్ పేరు మీద పలు సామాజిక కార్యక్రమాలను చేస్తున్నారు.

కేక్ కట్ చేసి, బాణా సంచా కాల్చిన తెలంగాణా అభిమానులు
ఇక ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించటంతో ఉదయకిరణ్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద భారీ కేక్ కట్ చేయించారు. బాణాసంచా కాల్చి తమ అభిమాన ట్రంప్ విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసారు. భారీ కటౌట్ పెట్టి స్నేహితులతో కలిసి ట్రంప్ విజయోత్సవ వేడుకలు చేసారు.
భారత్ యూఎస్ ల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయని ఆశాభావం
ఇక ట్రంప్ విజయంతో భారత్ యూఎస్ ల మధ్య సత్సంబంధాలు పెరిగి రెండు దేశాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నామని తెలిపారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ భారీ విజయం సాధించారు. తుది వరకు పోరాటం చేసిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఓటమి పాలయ్యారు.
ఘన విజయంపై ట్రంప్ స్పందన
ఇక ఈ ఘన విజయంపైన రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ తన స్పందన తెలియజేశారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ రాజకీయ మార్పు మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం అని ట్రంప్ అన్నారు. ఇది అపూర్వమైన రాజకీయ విజయం అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications