వరంగల్ వస్తే 'కెప్టెన్' ఇంట్లోనే కెసిఆర్: ఎవరీ లక్ష్మీకాంతరావు?
వరంగల్ ఎప్పుడు వచ్చినా కెసిఆర్ తప్పకుండా ఓ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కెప్టెన్ నివాసంలో బస చేయడమే ఆ సంప్రదాయం. ఇంతకీ ఎవరీ కెప్టెన్...
వరంగల్: ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావు వరంగల్ ఎప్పుడొచ్చినా ఒకే చోట బస చేస్తారు. అదీ కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో. ఇప్పుడు కూడా ఆయన ఆ సంప్రదాయాన్ని పాటించారు.
కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసం వరంగల్లో అడ్వొకేట్స్ కాలనీలో ఉంది. తెరాస వార్షికోత్సవ సభకు వచ్చిన కెసిఆర్ కోసం బుధవారం నుంచి లక్ష్మీకాంతరావు నివాసం లైట్లతో ధగధగ మెరిసిపోతూనే ఉన్నది. గురువారం రాత్రి కెసిఆర్ ఆయన నివాసంలోనే బస చేశారు.
లక్ష్మీకాంత రావుతో కెసిఆర్కు అంతటి అనుబంధం ఏమిటని చాలా మంది అనుకోవచ్చు. అసలు లక్ష్మీకాంత రావు ఎవరనే ప్రశ్న కూడా రావచ్చు.

ఆయన రాజ్యసభ సభ్యుడు
కెప్టెన్ లక్ష్మీకాంత రావు తెరాస రాజ్యసభ సభ్యుడు. కెసిఆర్ 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటే ఉంటున్నారు. దాంతో ఇరువురి మధ్య విడదీయరాని బంధం ఏర్పడిందని అంటారు. పార్టీ పెట్టే సమయంలో కెసిఆర్కు అవసరమైన సలహాలు ఇచ్చినవారిలో జయశంకర్తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంత రావు కూడా ఉన్నారని అంటారు. అప్పటి నుంచి కెసిఆర్ వరంగల్ ఎప్పుడు వచ్చినా ఆయన నివాసానికి వెళ్తూ వస్తున్నారు.

ఆయన ఏమిటి...
లక్ష్మీకాంత రావు వయస్సు ప్రస్తుతం 78 ఏళ్లు. నిజానికి ఆయన కరీంనగర్కు చెందినవారు. 1963 నుంచి ఆయన ఆర్మీకి సేవలందిస్తూ వచ్చారు. 1965లో జరిగిన భారత, పాకిస్తాన్ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. ఆయనకు రక్షా మెడల్ కూడా వచ్చింది. 1968లో ఆర్మీనుంచి తప్పుకుని ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కూడా కెప్టెన్ లక్ష్మీకాంత రావు సన్నిహితంగా ఉండేవారు.

కాంగ్రెసుతో రాజకీయ జీవితం ప్రారంభించి....
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరారు. 2001లో తెరాసలో చేరారు. రెండు సార్లు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలిచారు. 2014 -15 మధ్య ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు పెద్దగా హల్చల్ చేయరు.

గతంలో ఇలా ప్రశంసించారు...
మిషన్ కాకతీయ వంటి పథకాలకు ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో కెప్టెన్ లక్ష్మీకాంత రావు అన్నారు. కేసీఆర్ లాంటి వ్యక్తులకు తప్ప మరో వ్యక్తికి ఇలాంటి పథకాలు కనీసం ఊహకు కూడా అందవని చెప్పారు. మునుపెన్నడూ ఏ ముఖ్యమంత్రి సిద్దపడని సవాల్ కి సిద్దపడిన నాయకుడు కేసీఆర్ అని కితాబిచ్చిన కెప్టెన్, ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగను అని ప్రకటించుకోవడం ఒక్క కేసీఆర్ కే సాధ్యమైందని, అందుకే ఆయన మొగోడు అని అన్నారు.












Click it and Unblock the Notifications