ఫెర్టిలిటీ ఆసుపత్రిపై ఐటి దాడులు... భారీగా ఆస్తులు
ఆదాయ పన్ను కట్టకుండా ఎగనామం పెట్టిన ఓ ఫెర్టిలిటీ ఆసుపత్రిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
యాదాద్రి: ఆదాయ పన్ను కట్టకుండా ఎగనామం పెట్టిన ఓ ఫెర్టిలిటీ ఆసుపత్రిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఏక కాలంలో ఆ ఆసుపత్రికి చెందిన ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రులు, వారి నివాసాలపై మంగళవారం ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి.
ఈ సోదాల్లో లెక్కకు మించి ఆస్తులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.... భువనగిరిలో డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ ఆసుపత్రి ఉంది. అందులో డాక్టర్ పద్మజ ఫెర్టిలిటీ వైద్యురాలిగా పని చేస్తున్నారు. వీరికి హైదరాబాద్ లోని హబ్సిగూడలో కూడా మరో సంతాన సాఫల్య కేంద్రం ఉంది.
గత రెండేళ్ళుగా ఈ ఆసుపత్రులకు చెందిన యాజమాన్యం ఆదాయ పన్ను కట్టడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఐటి అధికారులు ఒక్కసారిగా దాడులకు దిగారు. చట్ట విరుద్ధంగా నిర్వహించిన సరోగసీ, పలు కాన్పుల రికార్డులను వారు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఐటి దాడుల్లో ఆసుపత్రుల యాజమాన్యానికి సంబంధించి పలుచోట్ల ఉన్న అక్రమ ఆస్తులకు సంబంధించిన విలువైన పత్రాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, ఈ ఆసుపత్రి యాజమాన్యం పలు అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం.