రేవంత్ చుట్టు బిగుస్తోన్న ఉచ్చు: తెరపైకి ఓటుకు నోటు, అరెస్ట్కు రంగం? రంగంలోకి డీఆర్ఐ
హైదరాబాద్/కొడంగల్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆయన నివాసంలో, ఆయన సోదరుడి నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
రూ.300 కోట్ల లావాదేవీలు, మార్పిడి: రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకంటే?
Recommended Video
ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. విదేశాల నుంచి డబ్బులు వచ్చినట్లు గుర్తించారని తెలుస్తోంది. ఉదయం నుంచి పలుచోట్ల సోదాలు చేస్తూ, ఎన్నో వివరాలు సేకరించారని తెలుస్తోంది. ఈ దాడులు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగే అవకాశముంది.
కోస్గి నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి
ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి కోస్గి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆయన హైదరాబాద్ వచ్చాక ఆయనను విచారించి, అతని నుంచి మరిన్ని వివరాలు అధికారులు రాబట్టనున్నారు. హవాలా నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని, వెళ్లాయని అధికారులు గుర్తించారని, వీటి గురించి ఆయనను ఆరా తీయనున్నారని తెలుస్తోంది. మలేసియా వంటి విదేశాల నుంచి డబ్బులు వచ్చి, ఇక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలుస్తోంది. వీటన్నింటికి సంబంధించిన వివరాలను అధికారులు రేవంత్ నుంచి రాబట్టనున్నారని తెలుస్తోంది.
ప్రకంపనలు.. రేవంత్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందా?
రేవంత్ రెడ్డి అరెస్టుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో అతనికి పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినట్లుగా సమాచారం. ఆయన కోస్గి నుంచి హైదరాబాదుకు రాగానే పోలీసులు అతనిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు, ఆయనకు అరెస్ట్ వారెంట్ ప్రచారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వస్తున్నారు. పోలీసులు ఆయన కోసం వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
ఈడీ నిర్ధారించాల్సి ఉంది, ఈడీ జోక్యం ఎందుకంటే...
శ్రీసాయి మౌర్య ఎస్టెట్స్ అండ్ ఫార్మ్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీతో పాటు రేవంత్కు చెందిన మరో కంపెనీ నుంచి వందల కోట్ల లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారని అంటున్నారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించాలి. ఇది కీలకంగా మారింది. రేవంత్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే, విదేశాల నుంచి డబ్బు రావడం, వెళ్లడం జరిగాయి కాబట్టి ఈడీ జోక్యం చేసుకుంటోందని చెబుతున్నారు.
అరెస్టుకు ఎంతమేరకు అవకాశాలు?
ఓ వ్యక్తి ఇంట్లో ఐటీ సోదాలు చేసే సమయంలో డాక్యుమెంట్లు సీజ్ చేసుకోవాలని నిబంధనలు ఉన్నాయి. ఐటీ అధికారులు సోదాల సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ సమయంలో కానీ సదరు వ్యక్తిని అరెస్టు చేయరాదు. ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో రేవంత్ వచ్చినా విచారణ జరిపాల్సి ఉంటుందని, అరెస్టుకు అవకాశం లేదని అంటున్నారు.
అరెస్టు కోసం ఓటుకు నోటు తెరపైకి
ఐటీ సోదాల సమయంలో అరెస్టుకు అవకాశం లేనందునే తిరిగి ఓటుకు నోటు అంశాన్ని తెరపైకి తెచ్చి ఉంటారని చెబుతున్నారు. అందుకో ఓటుకు నోటు కేసులో పోలీసులు వారెంట్ జారీ చేశారని చెబుతున్నారు. ఆయన వస్తే ఓటుకు నోటు కేసులో అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రేవంత్ విషయంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.
డీఆర్ఐ అధికారులు కూడా సోదా చేసే అవకాశం
ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ కూడా పలు అంశాలపై దర్యాఫ్తు చేయనుంది. దాడుల సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లో లేరు. ఐటీ, ఈడీతో పాటు డీఆర్ఐ అధికారులు కూడా హైదరాబాదుకు వస్తున్నారని తెలుస్తోంది. వారు కూడా సోదాలు నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. దీంతో రేవంత్ చుట్టు ఉచ్చు బిగుస్తోందని అంటున్నారు. సెబాస్టియన్ నివాసంలోను ఐటీ సోదాలు నిర్వహించింది. రూ.50 లక్షలు ఆయన కంపెనీలోకి వచ్చాయని గుర్తించారని తెలుస్తోంది.