వందే భారత్ రైలుకు పెరుగుతున్న డిమాండ్... హాల్టింగ్ ప్లీజ్ అంటూ..!
నిత్యం ప్రయాణికుల రద్దీ ఉండే చోట అవసరమైన చోట వందేభారత్ ఎక్స్ప్రెస్ ను ఆపాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా నిత్యం 20 వేల ప్రయాణికులతో, ప్రతిరోజు ఐదు లక్షల రూపాయల ఆదాయంతో దక్షిణ మధ్య రైల్వేలో గుర్తింపు పొందిన మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నిలుపుదల చేయాలని అక్కడ స్థానిక ప్రజలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మంచిర్యాల రైల్వే ప్రయాణికుల విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఆధునికీకరణ చేస్తున్న రైల్వేస్టేషన్లలో అమృత్ భారత్ పథకంలో సెలెక్ట్ అయిన మంచిర్యాల రైల్వేస్టేషన్ లోనూ వందే భారత్ ఎక్స్ప్రెస్ నిలుపుదల చేయాలని వారు కోరుతున్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ స్వచ్ఛతను దక్షిణ మధ్య రైల్వే విభాగంలో రెండుసార్లు పురస్కారాలు దక్కించుకుందని ప్రయాణికుల ద్వారా, గూడ్స్ ద్వారా, కోట్లాది రూపాయలను రైల్వేకు అందిస్తుందని అలాంటి మంచిర్యాల రైల్వే స్టేషన్ పైన చిన్న చూపు చూడడం న్యాయం కాదని ప్రయాణికులు అంటున్నారు.

సికింద్రాబాద్ నాగపూర్ వందే భారత్ ఆపాలని విన్నపం
రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞాపనలు చేసిన ప్రతిసారి మొండి చెయ్యే చూపుతున్నారని ఈనెల 15న సికింద్రాబాద్ నాగపూర్ మార్గంలో ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ఆపేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల మంచిర్యాల ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు.
మంచిర్యాల ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నిర్ణయం తీసుకోవాలని వేడుకోలు
ఈ రైల్వే స్టేషన్ సమీపంలో సింగరేణిగనులు, సిమెంట్ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా గూడ్స్ రైళ్లతో పాటు పలు ప్రాంతాలకు సరుకు రవాణా జరుగుతుందని, ఏవన్ గ్రేడ్ గా పరిణతి చెందిన మంచిర్యాల రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఆపాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
రైళ్ళు లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నామంటున్న ప్రయాణికులు
మంచిర్యాల నుండి సికింద్రాబాద్ తో పాటు నాగపూర్ కు వేలాదిమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారని, ఇక్కడ ముఖ్యమైన రైళ్ళు ఆగకపోవడంతో చాలామంది ప్రైవేట్ వాహనాల పైన ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ఉదయం ఐదు గంటల తర్వాత సికింద్రాబాద్ కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఏ ఒక్క రైలు లేదని దయచేసి వందే భారత్ ను తమ స్టేషన్లో నిలిపేలా నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
రామగుండం మాత్రమే కాదు మంచిర్యాలలోనూ హాల్టింగ్ ఇవ్వండి
రామగుండం తో పాటు మంచిర్యాలలోనూ రైలు నిలుపుదల చేస్తే ఈ ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుందని లేదంటే రామగుండం వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తుందని వారు అంటున్నారు. మరి రైల్వే అధికారులు మంచిర్యాల వాసుల విజ్ఞప్తి పైన ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications