ప్రయాణికులను నిలువు దోపిడీ చేసేందుకు సిద్ధమైన రైల్వే
భారతీయ రైల్వే వైఖరి ఎలా ఉంటుందంటే.. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఉంటుంది. వందేభారత్ రైళ్లపై విపరీతమైన ప్రచారం చేసి ఆహా, ఓహో అంటూ ప్రజల్లో వాటిపై ఆసక్తి పెంచేసింది. తీరా వచ్చిన తర్వాత వాటి ధరలు చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. పోనీ నాలుగు గంటలు పట్టే సమయం రెండు గంటలు పడుతుందా? అంటే అదీ లేదు. సూపర్ ఫాస్ట్ రైళ్లకు, వందే భారత్ రైళ్లకు మధ్య జర్నీ తేడా అరగంట నుంచి గంటలోపు ఉంటుంది. ఆ సమయం కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టడం అవసరమా? అనే సందేహం ప్రయాణికులందరిలో వ్యక్తమవుతోంది.
ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ రూంలా ఉంటుందంట
వందేభారత్ రైళ్ల ఛార్జీలే ఇలా ఉంటే త్వరలో ప్రవేశపెట్టబోతున్న వందేభారత్ స్లీపర్ రైళ్లల్లో ఒక కుటుంబం ప్రయాణించాలంటే వేలకు వేల రూపాయలు ఖర్చయ్యే అవకాశం కనపడుతోంది. వందేభారత్ స్లీపర్ అలా ఉంది, ఇలా ఉంది అంటూ రైల్వే మంత్రిత్వ శాఖ అదరగొడుతోంది. అద్భుతమైన కోణాల్లో ఫొటోలు తీయించి ప్రయాణికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అద్దాల మేడలా ఉంటుంది, ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ రూంలా ఉంటుందంటూ చెబుతోంది. అవి ప్రారంభమైన తర్వాత టాయ్ లెట్లలో నీళ్లు రాకపోవడం, దుర్వాసన రావడంలాంటివన్నీ మాములే. అది వందేభారత్ కావచ్చు.. ఏ భారత్ అయినా కావొచ్చు. ఇవి మాత్రం సాధారణం.

అంత ధర పెట్టి ఎక్కుతారా?
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రస్తుతం వందేభారత్ లో సీసీ టికెట్ రూ.1680, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3135గా ఉంది. తత్కాల్ లో అయితే రూ.600 అదనంగా పడుతుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సీసీ టికెట్ రూ.1695, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ.3095గా ఉంది. తత్కాల్ లో అయితే రూ.600 అదనం. వందేభారత్ స్లీపర్ వస్తే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు థర్డ్ ఏసీలో రూ.4వేలు, సెకండ్ ఏసీలో రూ.7వేల వరకు ఒక టికెట్ ధర ఉండే అవకాశం ఉంది. ఇంకా ధరలు ఫైనల్ కాలేదు. అంత ఉండే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. మరి ఈ ధరలతో ప్రయాణికులు వందేభారత్ స్లీపర్ ఎక్కుతారా? లేదా? అనేది అవి పట్టాలెక్కితే కానీ ఓ స్పష్టత రాదు. అప్పటివరకు వేచిచూడాలి.












Click it and Unblock the Notifications