ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా: కేసీఆర్తో కేజ్రీవాల్ దోస్తీనే కారణం!
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు పంపారు.
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీకి తెలంగాణలో భారీ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ ఛైర్మన్ ఇందిరా శోభన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు పంపారు.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో అరవింద్ కేజ్రీవాల్ దోస్తీని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇందిరా శోభన్ వెల్లడించారు. సామాన్యుల పార్టీ అని చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్తో కలిసి నడవాలని నిర్ణయించి ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని ఆమె ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్తాపానికి గురైనట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు వచ్చినప్పుడే కేజ్రీవాల్ ముందు తన సందేహాన్ని ఉంచానని చెప్పారు. ఈరోజు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కరించడాన్ని ఆమె తప్పుబట్టారు. అంబేద్కర్ ఫొటో పెట్టుకునే కేజ్రీవాల్ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న కేసీఆర్తో కలిసి ఈ దేశ ప్రజలకు కేజ్రీవాల్ ఏం సంకేతాలు ఇవ్వదల్చుకున్నారని ఇందిరా శోభన్ నిలదీశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశానని.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆమె చెప్పారు. కాగా, కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇందిరా శోభన్.. ఇటీవల వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. అయితే, కొద్ది రోజులకే ఆ పార్టీని వీడిన ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. తాజాగా, ఈ పార్టీకు కూడా ఆమె గుడ్బై చెప్పారు.