ఉత్తర తిరుపతిగా భాసిల్లనున్న ఇందూరు క్షేత్రం .. శిల్పకళ ఉట్టిపడే గులాబీ రాతి ఆలయం
అపురూపమైన శిల్పకళా సౌందర్యంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో సుందరంగా తీర్చిదిద్దబడింది నిజామాబాద్ జిల్లా ఇందూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఉత్తర తిరుపతిగా పేరుగాంచిన ఈ దేవాలయ నిర్మాణానికి చాలా విశిష్టత ఉంది . కర్ణాటకలోని ఓ క్వారీ తవ్వకాలలో లభించిన ఖరీదైన మరకత రాయిని వినియోగించి స్వామి వారి విగ్రహాలను తయారు చేయించారు. గులాబీ రంగు రాతితో నిర్మించిన ఈ దేవాలయం చాలా శోభాయమానంగా కనిపిస్తుంది. గాజులా ఉండే ఈ రాయితో తయారు చేయించిన విగ్రహాలు ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
2002 సంవత్సరంలో ఆలయాన్ని నిర్మించి తలపెట్టామని మైసూర్ అవధూత దత్త శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చెప్పారు. ఆ రోజునే ఉత్తర తిరుపతి గా నామకరణం చేసి స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టామని తెలియజేశారు గణపతి సచ్చిదానంద స్వామీజీ. సుమారు 20 కోట్లతో రాజస్థాన్ లోని ధోల్పూర్ రాతి తో ఆలయ నిర్మాణం చేపట్టారు. అహ్మదాబాద్, ఢిల్లీ లలోని అక్షర ధామ్ ఆలయాల నిర్మాణ ఆర్కిటెక్ట్ విపుల్ త్రివేది పర్యవేక్షణలో ఆయన అందించిన ప్లాన్ తో ఈ గుడి నిర్మాణాన్ని చేపట్టారు. అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ దేవాలయంలో శ్రీ అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్తపీఠ ఉత్తరాధి దత్త విజయానంద చేతులమీదుగా ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేకం నేటి నుండి వారం రోజులపాటు ఘనంగా జరుగుతోంది.

వారం రోజుల పాటు జరగనున్న పూజా కార్యక్రమాలలో భక్తులు విశేషంగా పాల్గొంటున్నారు.
మానవులు తమ జీవన కాలంలో మూడు దేవాలయాల కుంభాభిషేకం చూస్తే జీవితం ధన్యం అవుతుందని, అలాంటిది ఏకకాలంలో భక్తుల కోసం ఒకే క్షేత్రంలో 5 దేవాలయాల కుంభాభిషేకం చూసి తరించే గొప్ప అదృష్టం ఇందూర్ ప్రజల పుణ్య ఫలం గా కలిగిందని ఆలయ ప్రతిష్ట కుంభాభిషేకాలను ఉద్దేశించిమైసూర్ అవధూత దత్త శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు . ఇందూరు ఉత్తర తిరుపతి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, అత్యంత మహిమాన్వితమైన మరకత శ్రీ చక్ర సమేత లక్ష్మీదేవి, మరకత శ్రీగణపతి, మరకత శ్రీఆంజనేయ స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సదాశివ స్వామి వార్ల దేవాలయాలు కూడా ఉన్నాయి. పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా, ఉత్తర తిరుపతిగా చక్కని శిల్ప కళతో అలరారుతూ ఇందూరు క్షేత్రం భాసిల్లనుంది.












Click it and Unblock the Notifications