ఎమ్మెల్సీ కవితకు తెల్లవారుజామువరకు ఇంజక్షన్లు.. కోర్టులో బలంగా వాదోపవాదాలు!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన డైరెక్టరేట్ అధికారులు కోర్టులో కవితను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోర్టులో ఇరువైపులా న్యాయవాదులు బలంగా తమ వాదోపవాదాలకు వినిపించారు. కోర్టులో హాజరు పరచడానికి ముందు కోర్టు అనుమతితో విక్రమ్ చౌదరి కాసేపు కవితతో మాట్లాడారు.
అనంతరం కవిత తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి కోర్టు ధర్మాసనానికి వాదనలు వినిపిస్తూ గతంలో ఎన్నడూ లేనంతగా కవితకు బిపి అసాధారణంగా పెరిగిందని, ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు ఆమె ఇంజక్షన్లు తీసుకున్నారని పేర్కొన్నారు. ఆమె మెడికల్ రిపోర్టులను కూడా వైద్యులు తమకు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

సుప్రీం కోర్టులో ఈనెల 19వ తేదీన కవిత పిటిషన్ పై విచారణ జరుగుతుందని, కవితకు ఈ కేసులో మినహాయింపు ఇవ్వాలని విక్రమ్ చౌదరి కోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత విచారణను అప్పటివరకు ఆపాలని ఆయన కోర్టును కోరారు. కవితను అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈడీ అధికారులు ఉల్లంఘించారని విక్రమ్ చౌదరి కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు.
కవిత తరపున ఆయన వాదనలు వినిపించిన తరువాత, ఈడి తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ తమ వాదనలను వినిపించారు. కవితను ప్రొసీజర్ ప్రకారమే అరెస్టు చేశారని, ఆమెకు సెక్షన్ 50 ప్రకారం సమన్లు ఇచ్చారని కోర్టుకు తెలిపారు. ఏ కోర్టు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కవిత పై అవినీతి ఆరోపణలు, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ఆమెను మరింత లోతుగా ఈ కేసులో విచారించటం కోసం కస్టడీలోకి ఇవ్వాలని కోరారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు అందించారు. ఈ క్రమంలో కవిత కస్టడీపై కోర్టు తీర్పు విషయంలో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కోర్టు హాల్లో కవిత భర్త కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications