తెలంగాణకు మళ్లీ గుండుసున్నా!
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా తెలుగు ఇంటి కోడలైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు కోడలైనా కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదని.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని మండిపడ్డారు మహేశ్ కుమార్ గౌడ్. ఇది బీహార్ ఎన్నికల బడ్జెట్లా ఉందన్నారు. ఎన్నికల కోసమే బీహార్కు నజరానాలు ఇచ్చారన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.

రాజకీయంగా తెలంగాణను దెబ్బతీయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కపైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదన్నారు. త్వరలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ను ఉపయోగించుకుంటోందని మహేశ్ కుమార్ ఆరోపించారు.
నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో గురజాడ అప్పారావుగారి దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న పదాలను వాడారు.. మరి తెలంగాణ ప్రజలు దేశంలో మనుషులు కారా అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు.. కేంద్రమంత్రులు, ప్రధానిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేశారన్నారు.
ఇక, రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి నీటి పారుదల ప్రాజెక్టు జాతీయ హోదా, ఐటీఐఆర్ లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రాష్ట్రం నుంచి 40 వేల కోట్ల జీఎస్టీ వసూళ్లు ఉంటే.. ఆ మేర కేటాయింపులు లేవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణకు అవసరమైన సహాయం అందించాలని కేంద్రాన్ని కోరారు మహేశ్ కుమార్ గౌడ్.












Click it and Unblock the Notifications