ఆన్లైన్ లోన్ యాప్స్ ఘోరాలు: పలువురి అరెస్ట్, చైనీయుల హస్తం, ఈ 11 యాప్లతో జాగ్రత్త
హైదరాబాద్: ఆన్లైన్ లోన్ యాప్లకు సంబంధించిన కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. లోన్ యాప్లకు లక్షల్లో వినియోగదారులు ఉన్నారని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ యాప్లలో చైనా, సింగపూర్కు చెందిన సంస్థలు నిధులు అందజేస్తున్నాయా? అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు.
Recommended Video


వారే టార్గెట్..
స్థానికులతో కలిసి చైనా వాసి రెండు డిజిటల్ కంపెనీలను ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా కల్ సెంటర్లు కూడా నెలకొల్పినట్లు సీపీ తెలిపారు. మరో చైనా వాసి ఫిబ్రవరిలో వ్యాపార వీసాపై హైదరాబాద్ వచ్చి ఈ వ్యాపారంలో చేరాడు. ఎప్పటికప్పుడు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. మొత్తం 11 యాప్లు సృష్టించి రుణాలు ఇచ్చారు. 40 ఏళ్లలోపు ఉన్నవారినే లక్ష్యంగా రుణాలు ఇస్తున్నారని సీపీ చెప్పారు.

వడ్డీ ఎక్కువే.. చైనా, సింగపూర్..
25-30 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని, చెల్లింపులు ఆలస్యమైతే జరినామాన కూడా వేస్తున్నారని సీపీ సజ్జనార్ తెలిపారు. చైనా, సింగపూర్, ఇతర దేశాల నిధులు వచ్చాయా? అనే కోణంలో విచారిస్తున్నామని తెలిపారు. లోన్ యాప్ల కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన చైనా వాసి పరారీలో ఉన్నారని తెలిపారు. కాగా, అరెస్టైన నలుగురిలో ఓ చైనాయుడు ఉన్నట్లు సమాచారం.

ఆత్మహత్యలొద్దు.. ఫిర్యాదు చేయండి..
ఈ యాల్లకు ఎన్బీఎఫ్సీలతో సంబంధం లేదన్నారు. లోన్ యాప్ వ్యవహారాన్ని ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లామని, ప్రజలు ఈ ఆన్లైన్ యాప్ల వలలో పడవద్దని సూచించారు. మోసపోయినవారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆర్బీఐ కూడా ఈ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఈ ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపుల కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో బాధితులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

లోన్ ఘోరాల్లో.. చైనీయుల హస్తం
కాగా, ఈ లోన్ యాప్ల సృష్టికర్త చైనాకు చెందిన మహిళ అని తెలిసింది. ఈ జనవరిలో మనదేశానికి వచ్చిన ఆ మహిళ.. గురుగ్రామ్, ఢిల్లీ, హైదరాబాద్ తోపాటు తదితర నగరాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరిగి చైనాకు వెళ్లిపోయారు. అక్కడ్నుంచే ఇక్కడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంస్థల వేధింపులతో పలువురు ఆత్మహత్యకు పాల్పడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసిన ఐదుగురిని ట్రాన్సిట్ వారెంటుపై నగరానికి తీసుకొచ్చారు. ఇక నగరంలో అరెస్టైన ఆరుగురు నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, తాజాగా, లోన్ యాప్ల వేధింపులు తాళలేక పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఆన్లైన్ యాప్లతో జాగ్రత్త
ఈ 11 ఆన్లైన్ యాప్లతో జాగ్రత్తగా ఉండాలని, వీటి నుంచి అప్పులు తీసుకుని ఇబ్బందులు పడవద్దని అధికారులు సూచిస్తున్నారు. వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని చెబుతున్నారు.
1) Loan Gram
2) Cash Train
3) Cash Bus
4) AAA Cash
5) Super Cash
6) Mint Cash
7) Happy Cash
8) Loan Card
9) Repay One
10) Money Box
11) Monkey box












Click it and Unblock the Notifications