గీత కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్న్యూస్: రూ. 5 లక్షల బీమా సాయం నేరుగా ఖాతాలోకి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని గీత కార్మికులకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం 'గీత కార్మికుల బీమా' ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) నిర్ణయించారు. దీంతో కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు.
ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కల్లుగీత సందర్భంగా ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదృష్ట సంఘటనలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఊహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద వున్నదని సీఎం అన్నారు.
ఇప్పటికే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమౌతున్నదని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలోనే, కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ కారణంతోనైనా రైతులు మరణిస్తే వారి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల బీమా అందిస్తున్న విషయం తెలిసిందే.
కాగా, 'మే డే' కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి) రూపాయల చొప్పున పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని సీఎం తెలిపారు. పెరిగిన వేతనాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం తెలిపారు.












Click it and Unblock the Notifications