బీజేపి, టీఆర్ఎస్ వ్యవహారం కల్లు కాంపౌండ్ పంచాయితీ.!కావాలనే రచ్చ.!వారిమధ్య విభేధాలు లేవన్న రేవంత్.!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శక్షణా తరగతుల్లో భాగంగా రెండో రోజు నేతలు ప్రసంగించారు. టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపి, టీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. గత రెండు మూడు రోజులుగా మీడియా సాక్షిగా ఈ రెండు పార్టీలు దిగజారుడు భాష మాట్లాడుతూ, ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తూ కావాలనే రాజకీయ రచ్చ చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బహిరంగంగా ఈ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటున్నప్పటికి అంతర్గతంగా ఈ రెండు పార్టీలూ ఒక్కటే నని, పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తుంటాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీ రెండో రోజు శిక్షణా తరగతులు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రేవంత్ ఫైర్
గత నాలుగైదు రోజుల నుంచి సీఎం చంద్రశేఖర్ రావు - బండి సంజయ్ నిన్ను జైల్లో పెడతా అని ఒకరు, నీ మెడలు విరుస్తా అని మరొకరు నకిలీ సవాళ్లు చేసుకుంటూ ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఆత్మహత్యలు, పెట్రోలియం ధరలు కాదని ఇప్పుడు చంద్రశేఖర్ రావు - బండి సంజయ్ కేసులు పెట్టుకుందాం, కొట్టుకుందాం అన్న అంశం తో జనం దృష్టి మరల్చారని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు దొంగ డ్రామాలకు తెరతీశారని, సీఎం చంద్రశేఖర్ రావు అవినీతి, అక్రమాలపై చిట్టా ఉందని, తండ్రీ కొడుకుల్ని జైలుకు పంపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిందే చెబుతూ ఉన్నాడని రేవంత్ రెడ్డి గుర్తు చేసారు.
టచ్ చేయలేరు..కాని బీజేపి గులాబీ నేతలు టచ్ లోనే ఉంటారన్న రేవంత్
ఇక సీఎం చంద్రశేఖర్ రావు కూడా దమ్ముంటే టచ్ చేయమని సవాల్ చేస్తున్నాడని, ఒకరు టచ్ చేస్తామని, ఇంకొకరు టచ్ చేయాలంటూ సవాల్ విసురుకుంటున్నారని ధ్వజమెత్తారు. కానీ ఎవరూ ఎవరినీ టచ్ చేయకుండా, వాళ్లే ఒకరికొకరు టచ్ లో ఉంటున్నారన్నది పచ్చి నిజమన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, సీబీఐ, ఈడీ సంస్థల్ని ఏ విధంగా వాడుకుంటున్నారో అర్ధం అవుతోందని, గతంలో కనీవినీ ఎరుగని రీతిలో, రాజకీయ ప్రత్యర్థుల పైనే కాకుండా అడ్డు వస్తారనే నెపంతో మోదీ సర్కారు సొంత పార్టీ నేతల పై కూడా సీబీఐ, ఈడీ ని ఉసికొల్పిన ఉదంతాలు అనేకం ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసారు.
సొంత ప్రయోజనాలకోసం విచారణ సంస్థలు.. మరి కేసీఆర్ మీద ఎందుకు విచారణ జరపరన్న రేవంత్..
నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, యడ్యూరప్ప లాంటి నేతలను టార్గెట్ చేసిన మోదీ, అమీత్ షా, సీఎం చంద్రశేఖర్ రావు జోలికి మాత్రం రారని, ఈయనేమైనా సుద్దపూసా, కడిగిన ముత్యమా అని సూటిగా ప్రశ్నించారు. సొంత పార్టీ నేతల్ని సైతం దారికి తెచ్చుకోవడానికి సీబీఐ, ఈడీ దాడులు చేసే బీజేపీ నాయకత్వం, మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీని అణగదొక్కడానికి సర్వశక్తులు ప్రయోగించిన మోదీ కేసీఆర్ జోలికి మాత్రం రాకపోవడం వెనుక రహస్యం ఏంటిని ప్రశ్నించారు. తెలంగాణ జాతి సంపదను యథేచ్ఛగా, డేలైట్ రాబరీ చేస్తుంటే బీజేపీ పెద్దలకు ఎందుకు కనిపించడం లేదని రేవంత్ రెడ్డి నిలదీసారు.
బండి సంజయ్ పొలిటికల్ స్టంట్ మాత్రమే.. ధైర్యం ఉంటే కేసీఆర్ పైన కేంద్రానికి లేఖ రాయాలన్న పీసిసి ఛీఫ్
ధుర్యోదనుడి పై దృతరాష్చ్రుడి పుత్రవాత్సల్యం లాగా సీఎం చంద్రశేఖర్ రావు పై మోదీ తో పాటు అమీత్ షా కు ఈ దత్తపుత్ర వాత్సల్య మర్మం ఏంటన్నారు రేవంత్ రెడ్డి. మీ పరస్పర అనైతిక ఒప్పందాలకు తెలంగాణ సమాజాన్ని బలి చేస్తారా అని ప్రశ్నించారు. దోచుకుంటున్న బందిపోటు సీఎం చంద్రశేఖర్ రావు పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, దర్యాప్తు ఎందుకు చేపట్టడం లేదని, బండి సంజయ్ చేతనైతే సీఎం చంద్రశేఖర్ రావు పైన విచారణ జరపమని అమిత్ షాకు లేఖ రాయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.