ఆరని ఇంటర్ మంటలు..! ధర్నాలతో దద్దరిల్లుతున్న నగరం..!! ప్రగతి భవన్, కలెక్టరేట్ ముట్టడి..!!
హైదరాబాద్: ఇంటర్ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. నిరశనలు, ధర్నాలు, ఆందోళనలు, ముట్టడి వంటి కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తీవ్ర తప్పిదాలకు పాల్పడి పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. జనసేన, బీసి సంఘం నేత ఆర్. క్రిష్ణయ్య ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పది న్నర గంటలకు లక్డీకాపూల్లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన ఫలితాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమేగాక తల్లిదండ్రుల కడుపుకోతకు కారకులైన వారిని గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రగతి భవన్ ముట్టడికి జనసేన పిలుపు..! విద్యార్థుల మరణాలపై ప్రశ్రిస్తున్న పవన్..!!
ఇంటర్ వ్యవహారంలో జనసేన నిరశన వ్యక్తం చేస్తోంది. ఇంటర్ విద్యార్థులకు సమగ్ర న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి జనసేన పిలుపునిచ్చింది. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేంత ధ్యాసను ఇంటర్ ఫలితాల పట్ల చూపిస్తే 20 మందికిపైగా విద్యార్థుల ప్రాణాలు నిలచేవని జనసేన భావిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం, విద్యాశాఖ తప్పిదాన్ని ఎండగట్టేందుకే ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు జనసేన తెలంగాణ శాఖ చెప్పుకొస్తోంది.
మరణించిన కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్న బీసీ సంఘం..! డిమాండ్ చేస్తున్న ఆర్.క్రిష్ణయ్య..!!
ఇంటర్ వ్యవహారం పై బీసి సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య స్పందించారు. ఇంది వందకు వంద శాతం అదికారుల నిర్లక్ష్యమని ఆయన మండిపడ్డారు. చనిపోయిన విద్యార్తుల కుటుంబాలకు ఎలా న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీసి విద్యార్థి సంఘాల నాయకులతో ఆయన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చనిపోయిన ఇంటర్ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని క్రిష్ణయ్య డిమాండ్ చేసారు. ఒక్కో కుటుంబానికి 10కోట్ల రూపాలను నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించాలను డిమాండ్ చేసారు.
లోపాలను సవరించాలి..! ప్రక్షాళన చేస్తున్నామంటున్న ప్రభుత్వం..!!
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలను ఎలాంటి దరాఖస్తులు లేకుండా పునఃపరిశీలన చేస్తామని ప్రకటించింది. రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటికే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు డబ్బులు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇంటర్ ఫలితాలపై తీవ్ర దుమారం తలెత్తగా..దీనిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విద్యార్థుల భవిత మాది..! సమూల మార్పులు చేస్తామంటున్న బోర్డ్..!!
ఫెయిలైన 3 లక్షలకు పైగా విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. మరోసారి తప్పులు జరగకుండా పటిష్ఠమైన వ్యవస్థను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఫెయిలయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. రీ వెరిఫికేషన్ ప్రక్రియ 12 రోజుల్లోగా పూర్తి చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. 15 రోజుల్లో మెమోలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం సిబ్బంది నియామకం చేపట్టారు. గతంలో మూల్యాంకనం చేసిన అధ్యాపకులతోనే పునఃపరీశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధ్యాపకుల సెలవులను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.