వాళ్ల కన్ను పడిందంటే బంగారం మాయమే?: ఎట్టకేలకు చిక్కిన మాయ లేడీలు..
వీరి నుంచి 47.06తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులు, ఆటోలు, రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర మహిళల ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. చోరీల కోసమే పండుగల సీజన్లో వీరు నగరానికి వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఉన్నతస్థాయి మహిళల మాదిరిగా నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న వీరి నుంచి 47.06తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వీరిని రిమాండ్ కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా చీరాల, విజిలీపేట్కు చెందిన లక్ష్మీ, తిరుపతమ్మ, దేబోరా, ప్రమీల, కృష్ణవేణి, నాగమణి ఒక ముఠాగా ఏర్పడ్డారు. పండుగల సీజన్లో బంగారు ఆభరణాలను కొనేవాళ్లను టార్గెట్ చేసుకున్నారు. నగల కొనుగోలు తర్వాత వారిని అనుసరిస్తూ.. వారు ప్రయాణించే బస్సులు, రైళ్లలోనే ఎక్కి చోరీలకు పాల్పడుతుంటారు.
2007లో ఇదే తరహాలో చోరీలకు పాల్పడిన లక్ష్మీ, తిరుపతమ్మ హైదరాబాద్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. జైలు నుంచి వచ్చాక కూడా వీరి తీరులో మార్పు రాలేదు. మరికొందరితో కలిసి ఓ ముఠాలా ఏర్పడి చోరీలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి పోలీసులకు పట్టుబడ్డారు.