నదులన్నింటికీ ఒకే ట్రైబ్యునల్: కేంద్రమంత్రి, కేంద్రం జోక్యం చేసుకోవాలి.. ఏపీపై హరీష్ ఫైర్
హైదరాబాద్: జల వివాదాల సమస్యకు జాతీయస్థాయిలో ఒకే ట్రైబ్యునల్ ఉండాలని, నదుల వారీగా ట్రైబ్యునల్ డబ్బులు వృథా అని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ అన్నారు.
జలవివాదాలకు అంతం పలకడం, కోర్టుల వెలుపల పరిష్కారాలే లక్ష్యంగా హైదరాబాదులో దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన మాట్లాడారు.
జలవివాదాలకు చరమగీతం పాడాల్సి ఉందన్నారు. కోర్టులు, ట్రైబ్యునళ్ల వల్ల కాలయాపన, వృథా ఖర్చు అవుతోందని చెప్పారు. ఏళ్ల తరబడి జాప్యం వల్ల సమస్య మరింత జఠిలమవుతోందన్నారు.
సమస్య ఎంత పరిష్కారమైతే అంత త్వరగా అబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రధాని మోడీ ప్రాధాన్యాల్లో జలవివాదాల పరిష్కారం ఒకటి అన్నారు. పార్లమెంటులో మార్చి సెషన్లో బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు.
అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులకు ఏపీ అవరోధాలు సృష్టిస్తోందన్నారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఏపీ, కర్నాటక, తెలగంాణల మధ్య ఆర్డీఎస్ త్రైపాక్షిక ఒప్పందం అమలు చేయాలన్నారు.
కాళేశ్వరం పాత ప్రాజెక్టు కాదని కేంద్రం ధృవీకరించిందన్నారు. దీనిపై ఏపీ ఆరోపణలు నిరాధారమన్నారు. పోలవరంతో తెలంగాణలోని కన్ని ప్రాంతాలకు ముంపు ప్రమాదం ఉందని చెప్పారు. దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు.