డీమార్ట్ వద్ద విద్యార్థి మృతి.. ఆరోజు అక్కడ ఏం జరిగింది.. స్నేహితులు ఏం చెబుతున్నారు..
హైదరాబాద్లోని హయత్ నగర్ డీమార్ట్ వద్ద ఇంటర్మీడియట్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఓ కార్పోరేట్ కాలేజీలో చదువుతున్న అతను.. ఆదివారం సాయంత్రం బయటకొచ్చాడు. ఈ క్రమంలో సమీపంలోని డీమార్ట్ వద్దకు వెళ్లిన అతను.. మళ్లీ కాలేజీ హాస్టల్కు రాలేదు. దీంతో సిబ్బంది అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు హైదరాబాద్లోని బంధువులను కాలేజీ వద్దకు పంపించగా.. అతను ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసింది. తీరా ఆస్పతికి వెళ్లాక.. అప్పటికే అతను చనిపోయినట్టు తెలిసి షాక్ తిన్నారు.
ఎవరా విద్యార్థి
సూర్యాపేట జిల్లా జగ్గుతండాకు చెందిన బాలాజీ,నాగమణి దంపతుల పెద్ద కుమారుడు సతీష్ నాయక్ హైదరాబాద్,హయత్నగర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతూ.. అదే కాలేజీ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ఔటింగ్ నిమిత్తం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. అయితే మిగతా స్నేహితులు హాస్టల్కు తిరిగి వచ్చినా అతను మాత్రం రాలేదు. దీంతో హాస్టల్ వార్డెన్ అతతల్లిదండ్రులకు సమాచారం అందించారు.
బంధువులను పంపించిన తల్లిదండ్రులు
సతీష్ తల్లిదండ్రులు హైదరాబాద్లోని తమ బంధువులను హాస్టల్ వద్దకు పంపించారు. బంధువులు సతీష్ స్నేహితులను ఆరా తీయగా.. అతను ఆస్పత్రిలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ ఆసుపత్రి వద్దకు వెళ్లగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు తెలుసుకుని షాక్ తిన్నారు. సతీష్ మృతిపై అతని స్నేహితులను ప్రశ్నించగా.. డీమార్ట్ వద్ద జరిగిన ఘటనతోనే అతను మృతి చెందినట్టు చెప్పారు.
డీమార్ట్ వద్ద ఏం జరిగింది..
స్నేహితుల కథనం ప్రకారం.. డీమార్ట్ నుంచి బయటకొస్తున్న క్రమంలో సతీష్ రూ.10 చాక్లెట్ ఒకటి తన జేబులో వేసుకున్నాడు. గుర్తించిన సిబ్బంది.. అతని వెనకాలే బయటకు వచ్చారు. ఆ విషయం గమనించి సతీష్ చాక్లెట్ కింద పడేశాడు. సిబ్బంది వచ్చి తనిఖీ చేస్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో లేపేందుకు ప్రయత్నించగా.. అతను ఎంతకీ లేవలేదు. దీంతో అతను డ్రామాలు ఆడుతున్నాడని సిబ్బంది అక్కడినుంచి వెళ్లిపోయారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్దారించారు.
Recommended Video
విచారణకు సహకరిస్తామన్న డీమార్ట్..
మృతి వార్త తెలిసి హుటాహుటిన హైదరాబాద్ వచ్చిన అతని తల్లిదండ్రులు,బంధువులతో కలిసి డీమార్ట్ స్టోర్ ఎదుట సోమవారం బైఠాయించారు. సిబ్బంది కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. ఎస్టీ సంఘాలు కూడా వారి ఆందోళనకు మద్దతు పలికాయి. ఈ క్రమంలో వారు డీమార్ట్ అద్దాలు,ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి పంపించారు. కాలేజీ యాజమాన్యంపై కూడా వారు ఆరోపణలు చేశారు. చాక్లెట్ దొంగతనం చేయాల్సిన అవసరం తమ కుమారుడికి లేదని.. లక్షల ఫీజు కట్టి కాలేజీలో చేర్పిస్తే శవాన్ని అప్పగించారని వాపోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణకు సహకరిస్తామని డీమార్ట్ ప్రతినిధులు తెలిపారు.