అట్టహాసంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్
నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమయింది. ఈ ఉత్సవాలను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి చందూలాల్ శనివారం ప్రారంభించారు.
సికింద్రాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్, స్వీట్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమయింది. ఈ ఉత్సవాలను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి చందూలాల్ శనివారం ప్రారంభించారు.
అంతర్జాతీయ మిఠాయిల పండుగ.. వెయ్యికి పైగా నోరూరించే స్వీట్స్!
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్లో భారీ గాలిపటాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. స్వీట్ ఫెస్టివల్లో దాదాపు వెయ్యి రకాల స్వీట్లు కొలువు దీరనున్నాయి. ఇవాళ్టి నుంచి ఈనెల 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
22 దేశాలకు చెందిన నిపుణులు హైదరాబాద్లో నిర్వహించే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారని టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
రాష్ట్ర భాషాసాంస్కృతికశాఖ డప్పుల దరువులు, కోలాటాలు, గంగిరెద్దులు, హరిదాసులు, బుడబుడకలు వంటి సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించనున్నది. జానపద కూచిపూడి, ఆంధ్రనాట్యం, పేరిణి శివతాండవం, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపకాలను ప్రదర్శించనున్నారు.
దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యికి పైకా మిఠాయిలు ఉత్సవాల్లో ప్రదర్శిస్తారు. కాకినాడ ఖాజా, బందరు లడ్డూలు, పదిరకాల పాయసాలు కొలువుదీరనున్నాయి.
హైదరాబాద్లో స్థిరపడిన గుజరాతీలు, బెంగాలీలు, రాజస్తానీలు, కేరళ, తమిళనాడు, కర్ణాటక అసోసియేషన్స్ మిఠాయిలను ప్రదర్శనకు తీసుకురానున్నాయి. ప్రతి మిఠాయిని ఇంట్లో తయారు చేసి తీసుకురావాలనే నిబంధన విధించారు. మిఠాయిలకు గిరాకీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున విక్రయశాలలు ఏర్పాటు చేస్తున్నారు.