ఇంటర్నెట్ దుర్వినియోగం చేస్తే, 18 నెలల్లో అందరికీ ఇంటర్నెట్ (పిక్చర్స్)
హైదరాబాద్: ఇంటర్నెట్ను దుర్వినియోగం చేసే వారిని కట్టడి చేయాలని, ఇంటర్నెట్ అంటే ఇంగ్లీష్ ఒక్కటే కాకూడదని, ప్రాంతీయ భాషలకు కూడా చోటివ్వాలని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ శనివారం నాడు పిలుపునిచ్చారు.
మరో 18 నెల్లలో ఇంటింటికి ఇంటర్నెట్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవుతుందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ (ఐకాన్) 57వ అంతర్జాతీయ సదస్సును శనివారం హైదరాబాద్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
ఇంటర్నెట్ వినియోగంలో భారత్
ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ ముందంజలో ఉండబోతోందని, ఈ వ్యవస్థను ఏ ఒక్కరో నియంత్రించకుండా భాగస్వాములందరికీ దాని విధివిధానాల్లో చోటుండాలనే భారత్ మొదటి నుంచీ కోరుతోందని, ఇప్పుడా కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని, అందర్నీ కలుపుకొని వెళ్లే తత్వం మన దేశ ప్రజల రక్తంలోనే ఉందని కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు.
అందరికీ ఇంటర్నెట్
మొదటి నుంచి తాము భాగస్వామ్యాలకు విలువనిస్తామని, ఎలాంటి వివక్ష లేకుండా ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ తపన అని రవిశంకర ప్రసాద్ అన్నారు. భారత్లో డిజిటలైజేషన్ ప్రక్రియను, డిజిటల్ అక్షరాస్యతను వేగవంతం చేస్తున్నామని, ఇంటర్నెట్లో ఇంగ్లీష్ మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషలకూ పట్టం కట్టాలన్నారు. ఈ దిశగా ఐకాన్ దృష్టి సారించాలన్నారు.
సైబర్ భద్రత సవాల్
సైబర్ భద్రత పెద్ద సవాలుగా మారుతోందని రవిశంకర ప్రసాద్ అన్నారు. ఐకాన్ ప్రతినిధులు స్వేచ్ఛాయుతమైన నెట్ పైనే కాకుండా భద్రమైన నెట్పైనా ఆలోచించాలని, ఇంటర్నెట్ దుర్వినియోగం చేయకుండా నియంత్రించటానికి ప్రపంచమంతా కలసికట్టుగా ఓ యంత్రాంగాన్ని నిర్మించాలన్నారు.
ఉపయోగపడే స్టార్టప్లు
సామాన్యులకు ఉపయోగపడే స్టార్టప్లను యువ పారిశ్రామికవేత్తలు రూపొందించాలని రవిశంకర ప్రసాద్ పిలుపునిచ్చారు. అలాంటి ఆవిష్కరణలకు కేంద్రం అండగా ఉంటుందని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయంవంటి రంగాల్లో నూతన ఆవిష్కరణల అవసరం ఉందన్నారు.
ప్రతి ఇంటికి ఇంటర్నెట్
ఎన్నో అసాధ్యాలను సాంకేతికత సాధ్యం చేసి చూపిస్తోందని, ఇంటర్నెట్ ఈ నేలపై ఉన్న అందరికీ అందాలనేది తమ ఉద్దేశ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. అధిక ధరలు గానీ, భాషలుగానీ అంతరాలుగా నిలవకూడదన్నారు. అందుకే తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందివ్వటానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోందన్నారు.
పైబర్ నెట్
మిషన్ భగీరథతో పాటే ఫైబర్నెట్ను కూడా వేస్తున్నామని, మరో 18 నెలల్లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యమున్న తొలి రాష్ట్రం తెలంగాణ కాబోతుందని కేటీఆర్ అన్నారు. అమెరికా ప్రభుత్వ ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వీడి పరివర్తన చెందుతున్న ఐకాన్కు అందరి సహకారం అవసరమని ఐకాన్ సీఈవో గోరాన్ వ్యాఖ్యానించారు.