హైదరాబాద్ కు కొత్త పోలీస్ కమిషనర్ : సీవీ ఆనంద్ మరో స్పెషాల్టీ : ప్రభుత్వ ఎంపిక వెనుక..!!
తెలంగాణలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఈ మేరకు 30 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్న అంజనీకుమార్ ఏసీబీ డీజీగా బదిలీ చేస్తూ ఆయన స్థానంలో సీవీ ఆనంద్కు బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ పనిచేసిన అంజనీకుమార్ను మరో కీలకమైన ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. డీసీపీలుగా ఉంటూ ఉన్నచోటే డీఐజీలుగా పదోన్నతులు పొంది కొనసాగుతున్న ఏఆర్ శ్రీనివాస్, ఏవీ రంగనాథ్, కార్తికేయ, అవినాష్ మహంతికి సుదీర్ఘవిరామం తర్వాత కొత్త కొలువులు దక్కాయి.
భారీ కసరత్తు.. ఒకే సారి 30 మంది బదిలీ
నాన్కేడర్ ఎస్పీలుగా ఉంటూ మూడు రోజుల కిందట ఐపీఎస్లుగా పదోన్నతులు పొందిన కోటిరెడ్డి, కె.ఆర్.నాగరాజ్, ఉదయ్కుమార్రెడ్డి, ప్రవీణ్కుమార్తోపాటు.. నాన్కేడర్ ఎస్పీలుగా ఉన్న సందీప్, శ్రీనివాసరెడ్డి, సురేందర్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, మనోహర్, శిల్పవల్లి లాంటి అధికారులకూ కీలకమైన జిల్లా ఎస్పీలు, డీసీపీల స్థానం దక్కింది.
మరో విడత బదిలీలు..హైదరాబాద్ నేర విభాగంలో పని చేసిన షికా గోయల్ను ఏసీబీ డైరెక్టర్గా నియమించారు. నల్గొండ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రంగనాథ్ను హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా బదిలీ అయ్యారు. మెదక్ ఎస్పీగా ఉన్న చందనా దీప్తిని హైదరాబాద్ నార్త్ జోన్ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అంజనీ కుమార్ కు ఏసీబీ అప్పగింత
నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టింగు ఇవ్వలేదు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్గా ఉన్న మహేశ్ భగవత్కు స్థానచలనం కలగలేదు. దీన్ని బట్టి త్వరలో మరో విడత బదిలీలుంటాయని తెలుస్తోంది. ఇక, హైదరాబాద్ కమిషనర్ గా ప్రభుత్వం ఏరి కోరి ఆనంద్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 1991 బ్యాచ్ కు చెందిన సీవీ ఆనంద్ నక్సల్స్ ను ఎదర్కోవటంలో సక్సెస్ ఫుల్ అధికారిగా గుర్తింపు పొందారు.
దీంతో..ఆయన సుదీర్ఘకాలం వరంగల్..నిజామాబాద్..అదిలాబాద్ జిల్లాల్లోనే పని చేసారు. గతంలో హైదరాబాద్ నగరంలోనూ పని చేసిన అనుభవం ఉంది. విజయవాడ కమిషనర్ గానూ ఆయన పని చేసారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ కమిషనర్ గా... సీఐడీ అధికారిగా కొసరాజు వేంకటేశ్వర రావు కేసులోనూ గుర్తింపు పొందారు.
ఏరీ కోరి హైదరాబాద్ సీపీగా ఆనంద్ ఎంపిక
కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆనంద్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఏయిర్ పోర్ట సెక్టార్ ఐజీగా పని చేసి..రాష్ట్రానికి తిరిగి వచ్చారు. దీంతో...సీనియార్టీ..సిన్సియార్టీ పరిగణించి ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన హైదరాబాద్ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ఇక, ఆనంద్ మంచి క్రికెటర్ గానూ గుర్తింపు పొందారు.
ఆయన సికింద్రాబాద్ క్లబ్ తరపున క్రికెట్ ఆడేవారు. ఉన్నత విద్యావేత్తల కుటుంబానికి చెందిన ఆనంద్ ఐపీఎస్ కాకపోయి ఉంటే...క్రికెటర్ అయి ఉండేవారని ఆయన సన్నిహితులు చెబుతారు. ఇక, హైదరాబాద్ సీపీగా తన ముద్ర వేసిన అంజనీ కుమార్ కు ప్రభుత్వం కీలకమైన ఏసీబీ అప్పగించింది. సైబరాబాద్ సీపీగా పని చేసిన సజ్జనార్ కు ఆర్టీసీ.. హైదరాబాద్ సీపీగా పని చేసిన అంజనీకుమార్ కు ఏసీబీ అప్పగించిన ప్రభుత్వం...త్వరలో జరిగే బదిలీల్లో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్కు ఏ కీలక విభాగం అప్పగిస్తుందనేది వేచి చూడాలి.