టీఆర్ఎస్ లో అసమ్మతి స్వరాలకు బీజేపి కారణమా..? అదికారమే లక్ష్యంగా కమలం అడుగులు..!!
హైదరాబాద్ : తెలంగాణలో బీజేపి పాగా వేసేందుకు లోతైన ప్రణాళికలు రచిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రజాభిమానాన్ని పొందడంలో విఫలమయ్యాయి కాబట్టి, అదికార పార్టీకి ప్రత్యామ్నాయం ఇప్పుడు బీజేపి మాత్రమే ననే సంకేంతాలు తెలంగాణ ప్రజానికానికి చేరవేసి, తద్వారా లబ్దిపొందాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు లోక్ సభ స్థానాల్లో గెలపు తెలంగాణలో బీజేపికి కొత్త ఆక్సీజన్ లా పరిణమించింది. ఆ నాలుకు లోక్ సభ స్థానాల్లో గెలుపు ఇచ్చిన మనో స్త్యైర్యాన్ని భవిశ్యత్తులో కొనసాగించేంకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీజేపి. తెలంగాణలో అదికారంలోకి రావడమే లక్ష్యంగా కషాయ పార్టీ వినూత్న వ్యూహం రచిస్తోంది.
గులాబీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతి..! కారణం కమలం పార్టీయేనా..?
మొన్న హరీష్ రావు, నిన్న ఈటల రాజేందర్, తాజాగా కడియం శ్రీహరి. ఏదో జరుగుతోంది. గులాబీ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోంది. ముసలం మొదలైందనే సంకేతాలకు ఈ సంఘటనలు ఆజ్యం పోస్తున్నాయి. అయితే ఇదంతా తమ సొంత విషయమంటూ సీనియర్లు వంద మాటలు చెప్పొచ్చు. సీఎం చంద్రశేఖర్ రావు కూడా ఏవో ముతక సామెతలతో నాల్రోజులు మభ్యపెట్టనూ వచ్చు. అంతటితో అంతర్గత కుమ్ములాటలు సద్దుమణుగుతాయా? అసలెందుకీ అకస్మాత్తు వివాదాలు? పార్టీలకతీతంగా అందరి చూపులూ బీజేపీ వైపు చూస్తున్నాయి. ఇదంతా నిజమా? ఒట్టి బూటకమా అనే విషయాలను పక్కనబెడితే కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోయింది, తెలుగుదేశం పార్టీ గులాబీ కారు చక్రాల క్రింద ఎప్పుడో నలిగిపోయింది. ఇక మిగిలింది గులాబీ పార్టీ. అది కూడా ప్రజా వ్యతిరేక ప్రవాహంలో కొట్టుకుపోయే పార్టీనే అనేది బీజేపీ నేతల ధీమాగా తెలుస్తోంది.
అదికారమే లక్ష్యంగా బీజేపి అడుగులు..! తెలంగాణ నేతల తిరుగుబాటు వెనక బీజేపి ఉందా..?
అందుకే మరో నాలుగేళ్ల టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగే సమయంలోనే అంతర్గత వైరుద్యాలకు ఆజ్యం పోసి, కోలుకోలేని దెబ్బకొట్టి, తెలంగాణ వ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించాలనే బీజేపి కలను సాకారం చేయాలనేది అమిత్ షా వ్యూహమని స్థానిక నేతలు చెప్పుకొస్తున్నారు. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా కమలం పార్టీ నుంచి సౌందరరాజన్ కు తెలంగాణ గవర్నర్ గిరి అప్పగించారు. నరసింహన్ కూడా అదే తమిళనాడు నుంచి వచ్చినా, చాలా తెలివిగా కేంద్రానికి చెప్పాల్సిన వన్నీ చెబుతూ అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ పెద్దల మనసు దోచుకున్నారు. ఇదే నరసింహన్ కు కేంద్రంలో కీలకమైన పదవి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
టీఆర్ఎస్ ముఖ్య నేతలకు బీజేపీ గాలం..!అందుకు పరస్పర ఆరోపణలంటున్న నేతలు..!!
టీఆర్ఎస్ లో ముసలం పుట్టిందనేందుకు ప్రధాన కారణం హరీష్ ను దూరంగా ఉచంటంతోనే మొదలైంది. ముందస్తు ఎన్నికల తరువాత సీఎం చంద్రశేఖర్ రావు ఆలోచన సరళి మారింది. డీఎస్ ను పక్కనబెట్టారు, కేకే పక్కనే ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈటల రాజేందర్ బీసీ కార్డును తెరమీదకు తెచ్చి ఆజ్యం పోశారు. దీనికి మరింత సెగ పెడుతూ, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈటల మాటలను సమర్దించారు. వరంగల్ నేతలు కడియం శ్రీహరి, రాజయ్య మధ్య వైరం కూడా రోడ్డుపాలైంది. హరీష్, ఈటల, కడియం వంటి నేతలను కమలం వైపు లాక్కోవటం ద్వారా తెలంగాణలో తాము అనుకున్నది చేయాలనేది కమలనాథుల ప్రణాళికగా తెలుస్తోంది.
పెరుగుతున్న గులాబీ అసమ్మతి..! ప్రేక్షక పాత్రలో ప్రగతిభవన్ ప్రముఖులు..!!
అనుకోని అవకాశం కేంద్రానికి కాళేశ్వరం రూపంలో కనిపించింది. ఇప్పటికే దీనిపై పెట్టిన ఖర్చుపై సీబీఐ దర్యాప్తు చేయించాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. తాము కోరుకుంటన్నదీ ఇదే కాబట్టి తమ చేతికి మట్టి అంటకుండా కమలం కూడా ఇది ప్రజాభిప్రాయం మంటూ చేతులు దులుపేసుకుని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని సీబీఐ ను రంగంలోకి దింపి, చంద్రశేఖర్ రావు ఆశలను వమ్ముచేస్తూనే, బంగారు తెలంగాణ నినాదంతో ముందుకెళ్తున్న చంద్రశేఖర్ రావుకు అవినీతి మరకను అంటించడం ద్వారా తమ కదలికలను సుగమం చేసుకోవాలనేది బీజేపి మాస్టర్ ప్లాన్ గా తెలుస్తోంది.