తెలంగాణలో హంగ్ తప్పదా..? ప్రజలకు భరోసా ఇవ్వలేక పోతున్న పార్టీలు..!!
హైదరాబాద్ : తెలంగాణలో వంద సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్న అదికార గులాబీ పార్టీ ప్రజానికానికి అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. తెలంగాణపై సర్వహక్కులు సాధించి ముఖ్యమంత్రిగా నాలుగున్నరేళ్లుగా ప్రజలకు ఏం చేసారో చెప్పకుండా ఉద్యమంనాటి సంఘటనలు వల్లె వేస్తూ ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ప్రజలు పెదవి విరుస్తున్నారు. దీంతో గులాబీ పార్టీతో పాటు మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్, ఒంటరిగా బరిలోకి దిగుతున్న బీజెపి పార్టీలకు కూడా అంత మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అదికార టీఆర్ఎస్ పార్టీపైన ఉన్న వ్యతిరేకతతో తెలంగాణ లో హంగ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణలో ‘హంగ్' తప్పదా..? రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ..!!
తెలంగాణలో ఈ సారి ‘హంగ్' తప్పదా? రాజకీయ వర్గాల్లో వాడివేడిగా జరుగుతున్న చర్చ ఇదే..! నిన్న మొన్నటి వరకూ ద్విముఖ పోటీనే అనుకున్నా, ఇప్పుడు ‘త్రిముఖ' పోటీగా మారటం ఖాయంగా కన్పిస్తోంది. తిరిగి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న గులాబీ పార్టీ, బిజెపి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తూ వస్తోంది. అయితే బిజెపి మాత్రం తాజాగా తన వ్యూహాం మార్చినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్ ఓ వైపు మజ్లిస్ తో దోస్తీ చేస్తూనే, మరో వైపు తమతో కూడా స్నేహంగా ఉండటం బిజెపి నేతలకు ఏ మాత్రం రుచించటం లేదు. దీంతో తాడో పేడో తేల్చుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నారు కలమలనాథులు.

కేసీఆర్ పైన విమర్శల పదును పెంచిన బీజేపి..! తాడో పేడో తేల్చుకునేందుకు సై..!!
తమ అవసరం లేకుండా కెసీఆర్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే రాజకీయంగా తమకు ఏ మాత్రం లాభం ఉండదు కాబట్టి, ఎలాగైనా పది నుంచి పదిహేను సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతోంది బిజెపి. ఇందుకు అన్ని ‘అస్త్రాల'ను ఉపయోగించటానికి సిద్ధమైంది. కెసీఆర్ ఏ మాత్రం నమ్మదగిన ‘మిత్రుడు' కాదనే విషయం అటు ప్రధాని మోడీ, ఇటు అమిత్ షాకు చాలా స్పష్టంగా తెలుసని, అందుకే బిజెపి తన పని తాను చేసుకుపోతుందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతల్లో చర్చ జరుగుతోంది.

కూటమి ప్రభావం చూపే ఛాన్స్..! కాని కూటమిలో అసంత్రుప్త నేతలకు టీఆర్ఎస్ గాలం..!!
తెలంగాణలో 119 సీట్లకు పోటీచేస్తామని ఆ పార్టీ ప్రకటిస్తున్నా, ఫోకస్ మాత్రం ఎంపిక చేసిన సీట్లపైనే పెట్టబోతోంది. అది కూడా గెలిచే అవకాశం ఉన్న సీట్లను టార్గెట్ చేయటం, అన్ని పార్టీలో అసంతృప్తితో ఉన్న బలమైన నేతలను పట్టుకోవటం పైనే పార్టీ ఫోకస్ పెట్టింది. అలాంటి నేతలను అక్కున చేర్చుకోవటం ద్వారా సత్తా చాటాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రాబోయే రోజుల్లో బిజెపి దూకుడు మరింత పెరగటం ఖాయం అని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ఒంటరిగా బరిలో దిగుతుంటే, మరో వైపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ లు మహాకూటమిగా ఏర్పడ్డాయి.

పైకి 100 సీట్లని చెప్తున్న టీఆర్ఎస్ నేతలు..! గెలుపుపై గులాబీ నేతల్లో నెలకొన్న గుబులు..!!
ఈ కూటమి టీఆర్ఎస్ సర్కారుకు పెద్ద సవాలే విసరనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి కన్పించటం లేదని, ‘హంగ్' దిశగా అసెంబ్లీ అడుగులు వేస్తోందనే అంచనాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎఎస్ తమకు 100 నుండి 110 సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆ పార్టీకి ఏమాత్రం అంత అనుకూలంగా లేవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అదికార గులాబీ పార్టీ ప్రజా ప్రతినిధుల పట్ల ప్రజలు తీవ్రాగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. కొన్న గ్రామాల్లో నేతలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారంటే అదికారపార్టీపై తెలంగాణ ప్రజానికం ఎంత ఆగ్రహంతో ఉందో చెప్పొచ్చు. దీంతో తెలంగాణలో ఏపార్టీకి ఎంత మెజారిటీ వస్తుందో అంచనావేయడం కష్టంగా మారుతోంది.












Click it and Unblock the Notifications