అది సచివాలయమా..? సెటిల్ మెంట్ల అడ్డానా..??
Recommended Video
అది ప్రజలకు, ప్రభుత్వానికి వారదిగా ఉండే ప్రదేశం. ప్రభుత్వ పరి పాలన ఆ ప్రదేశం నుండే కొనసాగుతుంది. ప్రజలకు ఏకష్టం వచ్చినా ఆ ప్రదేశానికి వచ్చి తమ గోడును ఆమాత్యులకు వెళ్ల బోసుకుంటారు. తెలంగాణా లో 31జిల్లాల ప్రజలకు ప్రభుత్వ పరంగా చేకూరాల్సిన ప్రయోజనం కూడా ఆ ప్రదేశంలోనే శ్రీకారం చుట్టుకుంటుంది. అంతటి పవిత్రమైన ప్రదేశానికి 'సచివాలయం' అని పేరు కూడా ఉంది. కాని ప్రస్తుత సచివాలయం ప్రభుత్వ కార్యక్రమాలకు బదులుగా ప్రైవేటు సెటిల్ మెంట్స్ చేసుకునే అడ్డాగా మారిపోయింది. అందుకు సచివాలయం సాక్షిగా ఓ మంత్రి, ఓ ఎమ్మెల్యే మద్య జరిగిన వివాదమే ఉదాహరణ. ఏంటా వివాదం..? ఎవరా ఆమాత్యులు..?? తెలుకునే ప్రయత్నం చేద్దాం..!!
సచివాలయాన్ని సెటిల్ మెంట్ల అడ్డాగా మార్చిన ఆమాత్యులు..
వారు గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులు. అది పవిత్రమైన సచివాలయం. సదరు గౌరవనీయులు ఆ విషయం మర్చిపోయారు. ప్రజలకు సేవలందించాల్సిన సచివాలయాన్ని ప్రైవేటు పంచాయితీ సెటిల్ మెంట్ కు అడ్డగా మార్చేశారు. ఏకంగా మంత్రి ఛాంబర్ లోనే భూకబ్జా సెటిల్ మెంట్ కు సిద్ధపడ్డారు. మాటా మాటా పెరిగి ఒకరినొకరు తెగ కొట్టేసుకున్నారు. తెలంగాణ సచివాలయంలో దాదాపు వారం క్రితం జరిగిన ఈ సంఘటన బయటకు పొక్కలేదు. మీడియాకు ఎక్కలేదు. ఉద్దేశ పూర్వకంగానే తొక్కిపెట్టారో... లేక మీడియా వాసన పసిగట్టలేదో తెలియదు. కానీ, అయినదానికి కానిదానికి బ్రేకింగ్ న్యూస్ లతో దంచికొడుతోన్న ఈ కాలంలో ఈ బ్రేకింగ్ న్యూస్ మాత్రం మంత్రిగారి ఛాంబర్ నాలుగు గోడలు దాటి బయటకు రాలేదు. ఇంతకీ ఏం జరిగింది ? విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.
సచివాలయం సాక్షిగా తిట్లదండకం.. ఆ తర్వాత ఫైటింగ్..
దాదాపు వారం రోజుల క్రితం. దక్షిణ తెలంగాణకు చెందిన ఓ మంత్రి ఛాంబర్. ఓ భూకబ్జా సెటిల్ మెంట్ కు అడ్డాగా మారింది. టీఆర్ఎస్ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యేకు, మంత్రికి మధ్య ఈ ల్యాండ్ పంచాయితీ వచ్చి పడింది. భూమి పై హక్కులు కోరుతున్న ఇరు వర్గాలలో ఒకరికి మంత్రి వత్తాసు పలుకుతుంటే... మరొకరి పక్షాన ఎమ్మెల్యే నిలబడ్డారు. పంచాయితీ తేల్చుకుందాం రా అని సదరు ఎమ్మెల్యేను మంత్రిగారు ఏకంగా తన ఛాంబర్ కే ఆహ్వానించారు. మంత్రి గారితో పాటు సదరు ఎమ్మెల్యే, భూమి వివాదంలో ఉన్న ఇరువర్గాలు ఛాంబర్ కు చేరుకున్నాయి.
సీయం మంచితనాన్ని బలహీనతగా అర్థం చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు..
పంచాయితీ మొదలైంది. వ్యవహారం ఎటూ తేలడం లేదు. చినికి చినికి గాలి వానగా మారింది. అంతే... ఎమ్మెల్యే పై మంత్రి బూతులు లంకించుకున్నారు. ఎమ్మెల్యే మాత్రం తక్కువ తిన్నారా... ఆయన సేమ్ డైలగ్స్ రిపీట్ చేశారు. సీన్ డైలాగ్స్ నుంచి యాక్షన్ లోకి వచ్చేసింది. బూతుపురాణాల నుంచి... ఫైట్ సీన్ వరకు వచ్చేసింది. ఒకరి పైకి ఒకరు ఎగబడ్డారు. పిడిగుద్దుల వరకు వెళ్లిపోయారు. మధ్య మధ్యలో డైలాగ్స్ పేలుతూనే ఉన్నాయి. "ఈ సారి నువ్వు ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తావో చూస్తా రా " అని మంత్రి గారు సవాల్ విసిరారు. "నేను గెలుచుడు సంగతి తర్వాత... నువ్వు మంత్రిగా ఎట్లుంటావో చూస్తా రా..." అని ఎమ్మెల్యేగారు తెగ బడ్డారట.
అజమాయిషీ లేక పోవడంతో బరితెగిస్తున్న నాయకులు..
మధ్యలో అక్కడున్నవారు వీరిద్దరినీ వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయినా, ఆవేశంగా ఉన్నారు కదా! దీంతో ఓ మోస్తరు బిగ్ ఫైట్ తప్పలేదట!! అదీ విషయం. మీడియాలో రాకపోయినా సచివాలయమంతా ఈ దుర్ఘటన పై కోడై కూస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగూ సచివాలయానికి రారు. వచ్చీ రానట్టుగా వచ్చే మంత్రులు సైతం పబ్లిక్ ఇష్యూస్ వదిలేసి పవిత్రమైన సచివాలయాన్ని ప్రైవేటు పంచాయితీ సెటిల్మెంట్లకు అడ్డగా మార్చేస్తే ఎలా అన్నది ప్రశ్న. అయినా ఈ గొడవలో మీడియా వేలు పెట్టడం ఎందుకు..?? అన్నీ కేసీఆర్ సర్ చూసుకుంటారులే..!!