దుమ్మెత్తిపోస్తున్నారు, డిఫెన్స్లో కెసిఆర్!: 'ఆత్మహత్యాయత్నం ఆలోచనొస్తే ఫోన్ చేయండి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల పైన విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. రాజధానిలో రైతు ఆత్మహత్య లింబయ్య ఆత్మహత్య నేపథ్యంలో విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఓ వైపు ఆత్మహత్యలు కొనసాగుతుంటే సిఎం కెసిఆర్, మంత్రులు చైనా పర్యటనకు వెళ్లడం ఏమిటని నిలదీస్తున్నారు. దీంతో, డిఫెన్స్లో పడిన ప్రభుత్వం రైతు ఆత్మహత్యల పైన స్పందిస్తోంది.
అధికార పక్షం ప్రతిస్పందించడం మాని రైతు ఆత్మహత్యలు ఆపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాల తీరుపై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే, రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. రైతుల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు.
కౌన్సెలింగ్ ఇస్తాం: లక్ష్మా రెడ్డి
ఆత్మహత్యలు తగ్గించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి చెప్పారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులోని కింగ్ కోఠీలో కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఆత్మహత్యాయత్నం చేయబోయేవారు, ఆ ఆలోచనతో ఉన్నవారు 104కు ఫోన్ చ్సేతే తగిన కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోందన్నారు. ఆత్మహత్యలు తగ్గించేందుకు ప్రభుత్వం పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలకు చావే పరిష్కారం కాదన్నారు.
రైతు శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి: హరీష్ రావు
రైతు శ్రేయస్సు కోసమే తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్లోని బోథ్లో మాట్లాడారు. సమైక్య పాలకులు ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేశారని, గత కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రి లేడని, సీఎం కేసీఆర్కు ఆదిలాబాద్ జిల్లా మీద అంతులేని ప్రేమ ఉందన్నారు.
జిల్లాకు ఇద్దరు మంత్రులను ఇచ్చారన్నారు. జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దుతామని, రైతు శ్రేయస్సు కోసమే ప్రభుత్వ కృషి చేస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి ఎకరం పారాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. బోథ్ నియోజకవర్గంలో చెరువులన్నీ పునరుద్ధరిస్తామని చెప్పారు.
గుప్తి ప్రాజెక్టు డీపీఆర్ రాగానే పూర్తి చేస్తామని చెప్పారు. కరెంట్ కోసం రూ. 91 వేల కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ దే అన్నారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు.