టీటీడిపికి క్యాడర్ ఉన్నట్టా? లేనట్టా? అగ్ని పరీక్షగా హుజూర్నగర్ ఉపఎన్నిక!
హైదరాబాద్ : నాయకులు వెళ్లిపోయినా క్యాడర్ బలంగా ఉంది. కార్యకర్తలు పార్టీ జెండాను నమ్ముకొని ఉన్నారు. అవకాశం కల్పిస్తే సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఇది తెలుగుదేశం తెలంగాణలో ఎప్పటినుంచో బలంగా వినిపిస్తున్న మాట.ఈ మాటల్లో ఎంత నిజముంది..? నిజంగా క్యాడర్ చెక్కు చెదరలేదా..? రాజకీయ సమీకరణాలు ఈ స్ధాయిలో మారినా కార్యకర్తలు ఇంకా పార్టీని నమ్ముకొని ఉన్నారనే అంశంలో వాస్తవం ఉందా..? హుజూర్ నగర్ ఉపపోరు ఇలాంటి అస్పష్టతతో కూడుకున్న అంశానికి సమాధానం చెప్పబోతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్ధాయిలో క్యాడర్ ఉన్నా అది ఎన్నికల్లో ప్రభావం చూపేంత స్దాయిలో ఉందా అనే అంశమే ఆసక్తిగా మారింది.
ఎట్టకేలకు టీడిపి ప్రత్యక్ష పోటీ..! రంగంలో చావా కిరణ్మయి...!!
స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చాలా మంది తెలంగాణ నేతలు బల్ల గుద్ది చెప్పే అంశం ఇదొక్కటే. ఐతే ఈ అంశాన్ని ఎంత వరకు పరిగణలోకి తీసుకోవాలి అనేది మాత్రం సందేహాలను రేకెత్తిస్తుంటుంది. ఎన్నికల్లో అభ్యర్థులను ప్రత్యక్షంగా నిలబెడితే జిల్లా నేతలు చెప్పే అంశాల పట్ల స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఇతర పార్టీలకు మద్దత్తు ఇచ్చి తమ పార్టీ నేతల సహకారం వల్లే ఆ మాత్రం ఓట్లు పోలయ్యాయి అని చెప్పుకోవడం కూడా స్పష్టత లేని అంశంగా పరిగణించొచ్చు. ఐతే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సరైన నిర్ణయం తీసుకుందనే చర్చ జరుగుతోంది.
టీడిపి ఉనికి ఉందా..లేదా..! స్పష్టత ఇవ్వనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక..!!
ముసుగులో గుద్దులాట ఎందుకనే ధోరణిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ పట్ల రాష్ట్ర నేతలు, ఇతర నాయకులు చెప్పిన అంశాలు ఎంతవరకు వాస్తవాలో తెలుసుకోవాలంటే ప్రత్యక్ష్య ఎన్నికల్లో పాల్గొనాలి. అభ్యర్థి గెలుపోటములు, పోలైన ఓట్లను బట్టి క్యాడర్ ఎంత బలంగా ఉందో నిర్దారణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఇదే చేయబోతోంది. ఉప ఎన్నికలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ప్రత్యక్ష్యంగా రంగంలోకి దిగుతోంది. దీంతో పార్టీకి నిజమైన క్యాడర్ ఎంత ఉందో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేతలు చెప్తున్న అంశాలను క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతుందో బేరీజు వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో టీడిపి ఎక్కడుంది..? కాని క్యాడర్ బలంగా ఉందంటున్న నేతలు..!
ఐతే హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సాహసోపేత నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో ఇతర పార్టీ నేతలతో పార్టీ కార్యకర్తలను కూడా తమ పార్టీలో చేర్చుకుంది అధికార గులాబీ పార్టీ. మొదట తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలో చేర్చకున్నారు టీఆర్ఎస్ నేతలు. గ్రామస్దాయాలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు ఎగిరినంతగా ఇతర పార్టీల జెండాలు ఎగరలేక పోవడానికి పార్టీలు బలహీనపడిపోవడమేననే చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో అభ్యర్థిని రంగంలోకి దించి అదృష్టంతో పాటు అంగబలాన్ని అంచనా వేయాలనుకుంటోంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ.
చక్రం తిప్పింది ఆమెనే..! టికెట్ ఇప్పించి, చంద్రబాబును ఒప్పించింది కూడా ఆమేనట..!!
హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలో అభ్యర్ధిని రంగంలోకి దించితే ఆశించిన ఫలితం వస్తుందని, పార్టీకి ప్రజాధరణ ఉంది కాబట్టి బయటపడే అవకాశాలు ఉంటాయని, అందుకోసం చావా కిరణ్మయి అనే మహిళా అభ్యర్థి సరైన వ్యక్తి అని పార్టీ ముఖ్య నేతలతో పాటు, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రభావితం చేసే విధంగా ఓ ప్రముఖ మహిళా నేత చక్రం తిప్పినట్టు సమాచారం. అభ్యర్ధి అంశంలో ఆమే చంద్రబాబును ఒప్పించినట్టు చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీడిపి సీనియర్ నాయకురాలు విజయ పూర్ణచందర్ రావు హుజర్ నగర్ ఉపఎన్నికలో పొత్తుల గురించి స్పష్టత ఇచ్చి, ఏవిధంగా చేస్తే అభ్యర్థి గెలుస్తారో దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. విజయ పూర్ణచందర్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా చావా కిరణ్మయిని చంద్రదబాబు ప్రత్యక్షంగా రంగంలోకి దించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం మొత్తం కిరణ్మయి గెలుపుకోసం కృషి చేయాల్సిందిగా బాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఐతే ఈ ఉప ఎన్నికల ఫలితంతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎంత క్యాడర్ ఉందో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.