హైద్రాబాద్లో విధ్వంసానికి కుట్ర: ఎవరీ షఫీ? బతికే ఉన్నాడు
హైదరాబాద్: ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు హైదరాబాద్ పైన కన్నేశారు. దీంతో, ఎన్ఐఏ అధికారులు, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి సోదాలు నిర్వహించారు. పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఐసిస్ ఇండియా చీఫ్ షఫీ ఆర్మర్ పేరు తెరపైకి వచ్చింది.
హైద్రాబాద్పై ఐసిస్, ఇవే టార్గెట్: నెట్ ద్వారా బాంబు తయారీ నేర్చారు
ఐసిస్ ఇండియా చీఫ్ షఫీ ఆర్మర్ బతికే ఉన్నాడని కేంద్ర కౌంటర్ ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం హైదరాబాద్లో ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసి, విచారించిన సందర్భంగా ఈ విషయం వెల్లడైనట్టు తెలుస్తోంది.
రెండు నెలలక్రితం సిరియాలో భద్రతాదళాల దాడుల్లో షఫీ చనిపోయాడని వార్తలొచ్చాయి. అయితే అతడు బతికే ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. సిరియాలో ఉంటూ భారత్లో రిక్రూట్మెంట్లు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడని చెబుతున్నారు.
ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నుంచి నియామకాల ప్రక్రియ కొనసాగిస్తున్నాడని చెబుతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో మారణహోమం సృష్టించే ఆలోచనతో రిక్రూట్మెంట్లు చేశాడని తెలుస్తోంది.
ఎవరీ షఫీ ఆర్మర్?
షఫీ ఆర్మర్ అలియాస్ యూసఫ్ అల్ హిందీ(26). కర్ణాటక రాష్ట్రం భత్కల్ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. షఫీ అన్న సుల్తాన్ ఆర్మర్ కూడా ఐసిస్ ఇండియా చీఫ్గా గతంలో పని చేశాడు. గతేడాది మార్చిలో సిరియాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
అన్న దారిలోనే షఫీ నడిచాడు. ఇండియాలో ఐఎస్కు చీఫ్గా ఇక్కడి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడు. గతేడాది సోషల్ నెట్వర్క్లో 600 నుంచి 700 అకౌంట్లు తెరిచి, దేశంలోని యువతను ఐసిస్లోకి దించేందుకు ప్రయత్నించాడు.
టెక్కీ సాయంతో హైద్రాబాద్లో పేలుళ్లకు ఐసిస్ ప్లాన్: ఏం జరిగింది? (పిక్చర్స్)
గడిచిన ఏడాదిలో 30మందిని సిరియా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని వార్తలు వస్తున్నాయి. అయితే వీరిలో 23మందిని ఎన్ఐఏ ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుంది. ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) నుంచి విభేదించి వచ్చిన కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఇటీవలే జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ అనే ఉగ్రవాద విభాగాన్ని షఫీ ఏర్పాటుచేసినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ధీటుగా..
పాక్ నుంచి పని చేస్తున్న ఇండియన్ ముజాహిదీన్కు దీటుగా భారత్లో పేలుళ్లు జరిపి ఇక్కడ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో షఫీ ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇటీవల సిరియా నుంచి పాక్ వెళ్లి, భారత దేశంలో రిక్రూట్మెంట్లు వేగవంతం చేశాడని భావిస్తురు.
హైదరాబాద్లో విధ్వంసానికి ఐసిస్ కుట్ర: ప్రధాన సూత్రధారి టెక్కీ
ప్రతి రాష్ట్రంలోనూ ఒక ఐఎస్ మాడ్యూల్ తయారు చేస్తున్నారంటున్నారు. షఫీ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నట్టు చెబుతున్నారు. దేశంలో ఇండియన్ ముజాహిద్దీన్ కార్యకలాపాలు వేగవంతం చేయడంతో పాటు దిల్సుఖ్నగర్, పుణె, బెంగాల్, ముంబై తదితర ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడ్డ ఉగ్రవాది యాసిన్ భత్కల్తో షఫీ ఆర్మర్ సోదరుడు సుల్తాన్ ఆర్మర్కు సత్సంబందాలున్నట్టు తెలుస్తోంది.
ఐసిస్ వేగంగా విస్తరించడంతో ఆ వైపు మళ్లిన సుల్తాన్ తన సోదరుడు షఫీతో కలిసి భారత్లో భారీ పేలుళ్లకు కుట్ర చేశాడని, అయితే సుల్తాన్ మరణంతో ఆ కుట్రను అమలు చేసే బాధ్యతను షఫీ తన భుజాలపై వేసుకున్నాడని నిఘా వర్గాలు అంటున్నాయి.
హైద్రాబాద్లో పేలుళ్లకు ఐసిస్ కుట్ర: భారీ స్కెచ్, పోలీసులకే బెదిరింపు?
షఫీ కూడా 2009 వరకు ఇండియన్ ముజాహిదీన్లోనే పని చేసినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అందులో కీలకంగా ఉన్న రియాల్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, షానవాజ్ ఆలం, మహమూద్ సాజిద్లతో కలిసి పని చేసినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.