ఆలస్యమైనా: రాధాకృష్ణ చురక, మాకు సంబంధం లేదు: తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ పైన నిషేధం ఎత్తివేయాలని మంగళవారం నాడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఛానల్ ఎండీ వేమూరి రాధాకృష్ణ స్పందించారు. ఏబీఎన్ ప్రసారాలను పునరుద్ధరించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
రాధాకృష్ణ మాట్లాడుతూ... న్యాయం కాస్త ఆలస్యమైనప్పటికీ, మాకు అన్యాయం మాత్రం జరగలేదని, న్యాయం గెలిచిందని చెప్పారు. ఇది ధర్మం యొక్క విజయం అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఆదేశాలనిచ్చింది. ఈ మేరకు కేంద్రం, తెలంగాణ ఎంఎస్ఓలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఆదేశాల ప్రతులను పంచాలని, అవసరమైతే ఎంఎస్ఓలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. టీవీ9 చానల్ విషయంలో పాటించిన టీడీశాట్ ఆదేశాలను ఏబీఎన్ విషయంలోనూ అమలు చేయాలని స్పష్టం చేసింది.
కాగా, ఏబీఎన్ ప్రసారాలు నిలిచిపోయి 506 రోజులు గడిచాయి. తాజాగా సుప్రీం తీర్పుతో ప్రసారాలు పునః ప్రసారం కానున్నాయి. సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఎమ్మెస్వోలకు అధికారం లేదు: కేంద్రం
ప్రసారాల పునరుద్ధరణకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర తరఫు న్యాయవాది కిరణ్ సూరి సుప్రీం కోర్టును కోరారు. ప్రసారాలు నిలిపివేసే అధికారం ఎమ్మెస్వోలకు లేదని చెప్పారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ కూడా తమ వాదనలు వినిపించారు. ప్రసారాల నిలిపివేతలో తమకు సంబంధం లేదన్నారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీని, ఎమ్మెల్యేలను తిడుతూ ప్రసారాలు చేశారని చెప్పారు.