బతుకైనా చావైనా నీతోనే ... భర్త మరణించిన కొద్దిసేపటికే భార్య మృతి
మరణం సైతం ఆ జంటను వేరు చేయలేక పోయింది. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అన్న వేదమంత్రాలకు అర్థం చెబుతున్నట్లుగా ఆ దంపతులు ఇరువురూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని ఒక్కటిగా కన్నుమూశారు. జీవితాంతం తోడుంటానని పెళ్లినాడు అగ్నిసాక్షిగా భర్త ప్ర మాణం చేస్తే.. ఎందాకైనా నీ వెంటే నేనూ అంటూ ఆనాడు ఆయనతో కలిసి ఏడు అడుగులు నడిచింది.అదే అనుబంధాన్ని ఈనాడు మరణంలోనూ కొనసాగిస్తూ.. భర్త మరణించిన కొద్దిసేపటికే ఓ ఇల్లాలు ప్రాణాలు విడిచింది.
ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం మచ్చాపూర్లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. మచ్చాపూర్కు చెందిన నీరటి సారయ్య, లచ్చక్క భార్యాభర్తలు. ఏడాది కాలంగా సారయ్య అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించాడు. భర్త మరణ వార్త జీర్ణించుకోలేని లచ్చక్క ఒక్కసారిగా గుండెపోటు గురైంది.
కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. నిమిషాల వ్యవధిలో దంపతులిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరణంలోనూ వీడలేని ఆ దంపతుల బంధాన్ని స్థానికంగా అందరూ చర్చించుకుంటున్నారు. నువ్వు లేకుంటే నేను లేనని చాలామంది దంపతులు మాట్లాడినా మరణంలోనూ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం చాలా అరుదుగా జరిగే సంఘటన. ఇంతకాలం అన్యోన్యంగా బతికిన దంపతుల జంట కన్నుమూయడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.