ఆదాయానికి మించిన ఆస్తులు: రేవంత్కు నోటీసులు, ఉదయసింహ ఇంట్లో సోదాలు
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఐటీ యాక్ట్ 54, 55 కింద అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టారనే ఆరోపణలతో ఆదాయపన్ను శాఖ అధికారులు రేవంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీల్లో ఏకకాలంలో గురువారం ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు.
Recommended Video
జూబ్లీహిల్స్లోని రేవంత్ ఇంటితో పాటు, మరో 15 ప్రాంతాల్లో ఉదయం నుంచి తనిఖీలు చేశారు. ఐటీ శాఖతో పాటు, ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) అధికారుల కూడా సోదాల్లో పాల్గొన్నారు. డీఆర్ఐ అధికారులు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి నివాసాలపై సోదాలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాగా, రేవంత్ రెడ్డి గురువారం రాత్రి తన నివాసం వద్దకు చేరుకున్నారు. అధికారులు ఆయనను కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
ఓటుకు నోటు కేసు: ఉదయసింహ ఇంట్లో సోదాలు
ఇది ఇలా ఉండగా, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితోపాటు ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉదయ సింహ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైతన్యపురి పరిధిలోని హరిపురి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐదుగురు సభ్యుల ఐటీ శాఖాధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు.
అధికారులు ఆయన ఇంటికి వచ్చినపుడు ఉదయ సింహ తల్లి మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఉదయ సింహాకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఆయన సమక్షంలోనే ఐటీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.