తెలంగాణ మల్లన్నకు ఐటీ నోటీసులు.. రూ. 3 కోట్ల జరిమానా...
నోటీసులు అనగానే సాధారణంగా ఎవరికి ఇస్తారు. పన్నులు కట్టకుండా ఎగ్గొట్టిన వ్యక్తులకో లేక, ఒక సంస్థకో నోటిసులు వస్తాయి. కానీ, ఈసారి ఐటీ అధికారులు తెలంగాణలోని దేవుళ్లకు నోటీసులు జారీ చేశారు. అదేంటీ అనుకుంటున్నారా? అవునండి. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలకు ఐటీ శాఖా నోటీసులు జారీ చేసింది. అందులో ముఖ్యంగా తెలంగాణా మల్లన్నకు ఐటీ నోటీసులు అందాయి.
తెలంగాణలోని ప్రముఖ దేవస్థానం కొమురవెల్లి మల్లన్నకు రూ.11 కోట్లు కట్టాలంటు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. అంతేకాదు, ఈ ఆలయంపై జరిమానా కూడా విధించింది. సకాలంలో పన్ను కట్టనందున మరో రూ.3 కోట్ల జరిమానా కూడా కట్టాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఐటీ శాఖ అధికారులు.. ఈ ఆలయంతో పాటు బాసరలోని సరస్వతి ఆలయం, వేములవాడ రాజన్న సహా ఇంకా పలు దేవాలయాలకు ఇప్పటికే ఐటీ నోటీసులు వచ్చినట్టు చెప్తున్నారు.

ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు : అయితే, ఈ నోటీసులపై కొందరు భక్తులు మండిపడుతున్నారు. దేవాలయాలపై నోటీసులేంటని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు దోచుకొని, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన మల్లన్న గుడికి పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడం మోదీ సర్కారుకే చెల్లిందంటూ కొందరు భక్తులు మండిపడుతున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంభించడం సమంజసం కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తంగా.. రూ. 12 కోట్లు : తెలంగాణలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఆదేశించారు. ఐటీ చట్టం 147 కింద రూ.8,64,49,041 పన్ను చెల్లించాల్సి ఉన్నదని, దీన్ని సకాలంలో చెల్లించనందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 271 (1) సీ ప్రకారం రూ.3,49,71,341, ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1) డీ ప్రకారం మరో రూ.20వేలు, ఐటీ చట్టం 271 (ఎఫ్) కింద మరో రూ.5 వేలు జరిమానాలుగా చెల్లించాలని, మొత్తంగా రూ.12 కోట్లకుపైగా సొమ్మును తక్షణం చెల్లించాలని హైదరాబాద్ సర్కిల్ ఆదాయ పన్ను శాఖ నోటీసులను జారీ చేసింది.
జరిమానా విధించడం దారుణం : భక్తులు సమర్పించే కానుకలతో వెళ్లదీసే గుడికి రూ.8.64 కోట్ల పన్ను చెల్లించాలనడమే విడ్డూరమైతే.. ఆ పన్ను చెల్లించలేదంటూ మరో మూడున్నరకోట్లు జరిమానా విధించడం దారుణంగా కొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక సంస్థలు తమకు వచ్చే ఆదాయాన్ని లాభాపేక్ష లేకుండా ఖర్చు చేస్తాయి. ఇలాంటి ధార్మిక సంస్థలపై జరిమానాలు విధించడంలో ఆచితూచి ముందడుగు వేయాలని కొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications