రేవంత్ ఎఫెక్ట్, బాబుకు చిక్కులు తప్పవా?: ఓటుకు నోటుపై కూపీలాగుతున్నారు, రూ.5 కోట్లు ఎక్కడ?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు, ఓటుకు నోటు కేసులో నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాల ఇళ్లలో, బంధువుల ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి. ఈ సోదాల వెనుక అసలు టార్గెట్ ఓటుకు నోటు కేసు అనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. విచారణకు హాజరైన సెబాస్టియన్, కొండల్ రెడ్డి, రేవంత్ మామ పద్మనాభ రెడ్డి తదితరులను ఓటుకు నోటు సమయంలో దొరికిన రూ.50 లక్షల గురించి ఆరా తీశారు.
రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు- మరో కోణం, ఎన్నో డౌట్స్: అసలు టార్గెట్ వేరే ఉందా?
దీంతో రేవంత్ ఇంట్లో ఐటీ సోదాల అంశం ఓటుకు నోటు వైపు మరలిందని చెబుతున్నారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు మిగతా రూ.4.5 కోట్లకు సంబంధించి గుచ్చిగుచ్చి విచారణలో అడిగారు. తమ ఎదుట హాజరైన వారందరినీ వారి ఆదాయ వ్యయ వివరాల గురించీ ఆరా తీశారు. సోమవారం ఉదయ్ సిన్హా, పద్మనాభ రెడ్డి, సెబాస్టియన్, కొండల్ రెడ్డి తదితరులు విచారణకు హాజరయ్యారు. ఓటుకు నోటుపై అధికారులు దృష్టి సారిస్తుండటంతో చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్తారని వైసీపీ, బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
గంటల పాటు వారి విచారణ
కొండల్ రెడ్డి, పద్మనాభరెడ్డిలను దాదాపు మూడు గంటలు, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలను తొమ్మిది గంటలు విచారించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు. ఈ కేసుతో సంబంధమున్న వారిని వేర్వేరుగా ప్రశ్నించాలని నిర్ణయించారని తెలుస్తోంది. అందరికీ వేర్వేరుగా ప్రశ్నావళి రూపొందించారని తెలుస్తోంది. తొలుత వారి వృత్తి, ఆదాయం వివరాలు ఆరా తీసిన అధికారులు, ఆ తర్వాత రేవంత్తో ఉన్న బంధం లేదా సాన్నిహిత్యం గురించి అడిగారు.
రూ.50 లక్షల గురించి ప్రశ్న
ఓటుకు నోటు కేసు సమయంలో టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షల నగదు ఎక్కడ నుంచి వచ్చిందని సెబాస్టియన్ను ప్రశ్నించారని తెలుస్తోంది. ఆ డబ్బు ఎవరు తెచ్చారు, ఎవరు ఇచ్చారు, డబ్బు ఇచ్చే సంగతి తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ డబ్బు ఎలా వచ్చిందని అఢిగారు. అంతేకాదు, ఇదీ పన్ను కట్టిన డబ్బేనా అని అడగడంతో పాటు, మిగతా రూ.4.5 కోట్లు ఎక్కడ నుంచి తేవాలనుకున్నారని కూడా ప్రశ్నించారని తెలుస్తోంది. కొంత విరామం ఇచ్చి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు విచారించారు. తనను ఓటుకు నోటు కేసుకు సంబంధించి రూ.50 లక్షల గురించి అడిగారని, ఏసీబీకి ఇచ్చిన సమాధానమే ఇక్కడ చెప్పానని సెబాస్టియన్ అన్నారు. కేసు న్యాయస్థానంలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడలేదన్నారు.
ఓటుకు నోటు డబ్బుపై ఆరా
రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిని వ్యాపార లావాదేవీల గురించి ప్రశ్నించారని సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించే ఎక్కువగా అడిగారని తెలుస్తోంది. రేవంత్కు ఉన్న వాటా గురించి అడిగారు. ఈ నెల 10వ తేదీన మళ్లీ విచారణకు రావాలని చెప్పారు. రేవంత్ మామ పద్మనాభ రెడ్డిని ఆయన ఆస్తుల గురించి ఆరా తీశారు. అలాగే రేవంత్ ఆస్తులు, ఆదాయం గురించి ఆరా తీశారు. ఓటుకు నోటు కేసు రూ.50 లక్షలు రేవంత్ రెడ్డికి ఎలా వచ్చాయని అడిగారని తెలుస్తోంది. ఉదయ్ సిన్హా మాత్రం ఈ నెల 3వ తేదీన వస్తానని చెప్పారు.
సంతృప్తికర సమాధానం వచ్చే వరకు
విచారణ సమయంలో ఓటుకు నోటు సహా పలు అంశాలపై తగిన సమాచారం లేదని, తమకు తెలియదని, వివరాలను వెల్లడించేందుకు సమయం కావాలని విచారణకు హాజరైన వారు చెప్పారని తెలుస్తోంది. సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకు విచారిస్తామని ఐటీ అధికారులు అంటున్నారు.
వారు సమయం అడిగారు
మరోవైపు, సాయిమౌర్య ఎస్టేట్స్ అండ్ ప్రాజెక్ట్స్ సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లు ప్రవీణ్ రెడ్డి, సురేష్ రెడ్డి, శివరామి రెడ్డి, రామచంద్రా రెడ్డిలు కూడా విచారణకు హాజరయ్యారు. రేవంత్ బావమరిది జయప్రకాశ్ రెడ్డికి చెందిన ఈ సంస్థ వద్ద లెక్కచూపని ఆదాయం రూ.20 కోట్లు ఉన్నట్లు ఇటీవల జరిగిన సోదాల సందర్భంగా అధికారులు గుర్తించారు. దీనిపై ప్రశ్నించారని తెలుస్తోంది. ఈ సంస్థతో రేవంత్ రెడ్డికి సంబంధంపై ప్రశ్నించారు. తమకు కొంత సమయం కావాలని డైరెక్టర్లు చెప్పారు.