కెసిఆర్కు షాక్ ఇస్తారా: కాంగ్రెసులోకి వలసలు మైండ్ గేమా, నిజమేనా?
సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో ఇష్టాగోష్ఠిగామాట్లాడారు.ఏడెనిమిది మంది మంత్రులు, 15 మంది వరకు అధికార ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు.సరైన సమయంలో వారు కాంగ్రెస్లోకి వస్తారని పేర్కొన
Recommended Video
హైదరాబాద్: త్వరలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా? అధికార టీఆర్ఎస్ నుంచి వలసలు తప్పనిసరిగా జరుగనున్నాయా? ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్ పట్ల బెంగ పట్టుకున్నదా? అనుమానాలు, సందేహాలు ఉన్న వారంతా 'హస్తం' పార్టీ వైపు చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క.
దాదాపు సగం మంది క్యాబినెట్ మంత్రులు అంటే ఏడెనిమిది మంది మంత్రులు, 15 మంది వరకు అధికార ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని ఆయన తెలిపారు. సరైన సమయంలో వారు కాంగ్రెస్లోకి వస్తారని పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో భట్టి మీడియాతో ఇష్టాగోష్ఠిగామాట్లాడారు. వివిధ అంశాలపై మనస్సు విప్పి ముచ్చటించారు. టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. తెలంగాణపై పట్టు సాధించాలని.. అందుకు కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ప్రోత్సహించాలని కమలనాధులు కదన కుతూహలంతో వ్యూహ రచనలు చేస్తూ ఉంటే.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణితో కనిపిస్తుండటం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వైచిత్రికి నిదర్శనంగా కనిపిస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలను పునర్వ్యస్థీకరించాల్సిన బాధ్యతలు చేపట్టకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికార టీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలను ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నది.
వీటన్నింటికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ సంధానకర్తగా వ్యవహరించబోతున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. జాతీయ స్థాయిలో చేష్టలుడిగి ఉన్న కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ కొట్టే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతూ ఉంటే.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టడం మాని.. కేవలం మీడియా ముందు విమర్శలు.. వ్యాఖ్యలతో ప్రజలకు దగ్గర కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నట్లు కనిపిస్తున్నది.
జిల్లాల వారీ ముందుకొచ్చిన సమస్యలు పట్టించుకున్నదెవరు?
అసలే భావోద్వేగాన్ని రంగరించి సెంటిమెంట్ రగిలించడంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తర్వాతే మిగతా వారెవ్వరైనా నిలుస్తారు. ఆయన ప్రచారార్భాట ధాటిని తట్టుకునే వారు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, టీడీపీలోనూ, అటు బీజేపీలోనూ తెలంగాణ అంతటా కాగడా వేసి వెతికినా దొరకరంటే అతిశేయోక్తి కాదు. అయితే ఒక్క మినహాయింపు మాత్రం ఉన్నది. 2001 నుంచి 2014 వరకు పరిస్థితులు వేరు.. 2014 నుంచి ప్రస్తుతం జరుగుతున్నది విభిన్నం. ఎన్ని రాజకీయ చమక్కులు ప్రదర్శించినా తెలంగాణ సబ్బండ వర్ణాల్లో ఈ దఫా తిష్ఠ వేయడం అంత తేలికేం కాదు. కానీ ఆయా జిల్లాల వారీగా పలు సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో సమస్య ఉన్నది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. జిల్లాకో హామీ ఇచ్చి ఉన్నారు. వాటి అమలు ప్రక్రియ ఏండ్లు, పూండ్లు దాటే సంకేతాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్లో పార్టీ బలోపేతం అవుతుందన్న సంకేతాలు కనిపించిన చోట, అవసరాలు, అవకాశాలు ఉన్నాయన్న జిల్లాల్లో మాత్రమే కొన్ని ప్రగతి పథకాలు అమలవుతున్నాయన్న సంగతి నిష్ఠూర సత్యం.
కరీంనగర్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం హామీ అమలు సంగతేమిటి?
ఉదాహరణకు సిద్ధిపేట జిల్లా ఏర్పాటు కాగానే మెడికల్ కళాశాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2014లో సీఎంగా కొలువుదీరిన తర్వాత కరీంనగర్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట అమలుకు నోచుకోనే లేదు. ఇక నల్లగొండ జిల్లాలో ఐటీ పార్క్ నిర్మాణం 2014కు ముందే ప్రారంభించినా తర్వాత దాని అతీగతీ లేదు. ఈ అంశాలపై జిల్లాల వారీగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తే తప్ప, ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం అంత తేలికేం కాదు. కేవలం మీడియా ప్రకటనలు, పొలిటికల్ మేనేజ్మెంట్లపై ఆధారపడి రాజకీయాల్లో మనుగడ సాగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పూర్వ వరంగల్ జిల్లా ఓ మహిళా శాసన సభ్యురాలు తమతో టచ్లో ఉన్నారని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్, టీడీపీల నుంచి దాదాపు అన్ని జిల్లాల నేతలు వలస రానున్నట్టు తెలిపారు. ఒకసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, ఎమ్మెల్సీగానో ఎన్నికైన తర్వాత ప్రజాప్రతినిధులు అధికారానికి దగ్గరగా ఉండటానికే ప్రయత్నిస్తారు? తప్ప. ఒడ్డున పడ్డ చేపపిల్లలా గిలగిల లాడిపోయేందుకు కాదన్న సంగతి మల్లు భట్టివిక్రమార్కకు కూడా తెలుసు. కనుక అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా.. ఎమ్మెల్సీలైనా, ఎంపీలైనా మున్ముందు 2019లో జరిగే ఎన్నికల్లో గెలుస్తుందన్న పార్టీలో ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప.. ఆశల ఊసులే తప్ప.. కార్యాచరణ లేని కాంగ్రెస్ పార్టీలో చేరతారని భావించడం కలే అవుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని విశ్వసిస్తే తప్ప ఆ పార్టీలో ఇతర పార్టీల నేతలు చేరడం దుర్లభమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వలసతోనే అధికారానికి కాంగ్రెస్ చేరువవుతుందా?
‘అధికార టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ నియంతృత్వ పోకడతో విసిగిపోయి ఉన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో కూడా వ్యతిరేకత బలంగా ఉంది. క్షేత్ర స్థాయిలో తిరుగుతున్న అధికార పార్టీ నేతలు దీన్ని గుర్తించారు. అందుకే వారు కాంగ్రెస్తో టచ్లోకి వస్తున్నారు'' అని భట్టి తెలిపారు. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన నేతలు మళ్లీ రానున్నారా? అని ప్రశ్నించగా.. ‘‘మా పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లినవారిలో కొందరు మాకు కోవర్టులుగా పని చేస్తున్నారు. వారు కూడా సరైన సమయంలో వెనక్కు వస్తారు'' అని జవాబిచ్చారు.
ఎంతమంది వచ్చినా తీసుకుంటారా? అని ప్రశ్నించగా ఎవరెవర్ని తీసుకోవాలన్న దానిపై సందర్భం వచ్చినపుడు అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాజకీయంగా బలోపేతమైతే ఈ వలసలు అదనపు వరంగా మారతాయే గానీ, కేవలం వలసలతోనే కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మారిపోతుందని భావించడం అత్యాశే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితిని, జరగబోయే పరిణామాలను మాత్రమే తాను వివరిస్తున్నట్టు భట్టి విక్రమార్క చెప్పారు. మంత్రుల్లో ఎవరెవరు వచ్చే అవకాశం ఉందని అడగ్గా ‘‘దయచేసి పేర్లు అడగవద్దు. దానివల్ల వారికి మాకు ఇబ్బందే. ప్రత్యర్థి శిబిరం అప్రమత్తం అవుతుంది'' అని భట్టి అన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.
పథకాల పున: సమీక్ష సరే.. ముందు కాంగ్రెస్ భవితవ్యంపై ఆలోచించండి
వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రానున్నందు వల్లే టీఆర్ఎస్ నేతలు తమవైపు చూడడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. రైతుల సమస్యలు, రైతులకు బేడీలు, నేరెళ్ల ఘటన, మియాపూర్ భూములు, ప్రాజెక్టుల రీడిజైన్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధలాంటి అంశాల ఆధారంగా కాంగ్రెస్ ఎన్నికల్లో జనంలోకి వెళ్తుందని ఆయన తెలిపారు. అంత వరకు బాగానే ఉన్నది. కానీ ఆయా ప్రాజెక్టుల పనితీరు, ప్రగతిని ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమీక్షిస్తే వాస్తవ పరిస్థితి దోహద పడేది.
కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పని చేశారంటే నమ్మడం కష్ట సాధ్యమైన పనేనని విమర్శకుల మాట. ప్రాజెక్టుల పేరుతో అధికార టీఆర్ఎస్ నిలువు దోపిడీకి పాల్పడుతోందని మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు.. కేవలం రూ. 33 వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయ్యేవన్నారు. కానీ రీడిజైన్ పేరిట సీఎం కేసీఆర్ వాటి రూపు రేఖలు మార్చి ఖర్చును రూ. 1.50 లక్షల కోట్లకు తెచ్చారని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాలన్నింటినీ పునసమీక్షిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.