అది ప్రమాదం కాదు మాక్ డ్రిల్ - శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో తాజా ఘటనపై జెన్కో సీఎండీ వివరణ
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బుధవారం మరోసారి ప్రమాదం జరిగిందంటూ ప్రసారమైన వార్తలపై జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. సరిగ్గా పది రోజుల కింట ఇక్కడ చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా.. బుధవారం మధ్యాహ్నం.. విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న డీసీఎం వ్యాను.. పక్కనే ఉన్న విద్యుత్ కేబుళ్ల పైనుంచి వెళ్లడంతో షార్ట్సర్క్యూట్ జరగడం, శబ్దాలతో మంటలు రాగా.. సిబ్బంది భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కలకలం రేపాయి. అయితే..
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో మళ్లీ ప్రమాదం - పరుగులు తీసిన ఉద్యోగులు - విద్యుత్ సరఫరా ఆపడంతో..
బుధవారం నాటి సంఘటన ప్రమాదం కాదని, ఫైర్ సేఫ్టీ కోసం మాక్ డ్రిల్ నిర్వహించామని జెన్కో సీఎండీ తెలిపారు. మరోసారి అగ్నిప్రమాదం జరిగితే ఎలా స్పందిస్తారో, ఏ విధంగా అప్రమత్తం అవుతారో తెలుసుకునేందుకే మాక్ డ్రిల్ చేపట్టామని, ఇటీవల జరిగిన భారీ ప్రమాదంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపధ్యంలోనూ అప్రమత్తత కోసం ఈ చర్యలు చేపట్టామని ప్రభాకర్ రావు చెప్పారు.
తాజా ఘటనకు సంబంధించిన వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో అక్కడ పనిచేస్తోన్న సిబ్బంది కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. దీంతో జెన్కో సీఎండీ మీడియాకు అసలు విషయాన్ని వెల్లడించారు. అది ప్రమాదం కాదు, మాక్ డ్రిల్ అని తెలియడంతో సిబ్బంది, వారి కుటుంబీకులు, స్థానిక ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
Recommended Video
ఇదే ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో పది రోజుల కిందట షార్ట్ సర్క్యూట్ కారణంగా తలెత్తిన భారీ ప్రమాదంలో 9 మంది సిబ్బంది చనిపోయారు. నాటి ఘటనపై ఓ వైపు సీఐడీ దర్యాప్తు కొనసాగుతుండగానే.. పవర్ ప్లాంట్లో పునరుద్ధరణ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. విశ్రాంత అధికారులతో కలిసి స్వయంగా శ్రీశైలం ప్లాంటుకు వెళ్లొచ్చానని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.