మోసం చేశారు... నన్నే బెదిరిస్తున్నారు... డీసీపికి జబర్దస్త్ వినోద్ ఫిర్యాదు... న్యాయం చేయాలని వినతి...
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హాస్య నటుడు వినోద్ గురువారం(ఏప్రిల్ 8) హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిశారు. ఇల్లు అమ్మేందుకు తనతో ఒప్పందం కుదుర్చుకున్న అద్దె ఇంటి యజమాని.. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు కంటే ఎక్కువ మొత్తం డబ్బు డిమాండ్ చేస్తున్నాడని... లేనిపక్షంలో అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు కూడా ఇవ్వనని బెదిరింపులకు దిగుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తనపై భౌతిక దాడి కూడా చేశారని.. దానిపై కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అసలేం జరిగింది...
జబర్దస్త్ వినోద్ స్వస్థలం కడప జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్లో సెటిల్ అవడంతో అక్కడున్న ఇంటిని అమ్మేసి హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలని భావించాడు. అనుకున్నట్లుగానే నగరంలోని కుత్భిగూడలో తాను అద్దెకు ఉంటున్న ఇంటినే రూ.42లక్షలకు కొనుగోలు చేసేందుకు రెండేళ్ల క్రితం యజమానితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందుకు రూ.10లక్షలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఇదే క్రమంలో ఓరోజు వినోద్ ఇంట్లో లేని సమయంలో... ఇంటి గోడ నిర్మాణం కోసమని చెప్పి అతని తల్లి నుంచి యజమాని రూ.8లక్షలు తీసుకున్నాడు. ఇంటి కొనుగోలు కోసం చెల్లించాల్సిన మొత్తంలో దాన్ని తగ్గించుకుంటామని చెప్పడంతో అతని తల్లి డబ్బులు ఇచ్చింది.
మాట మార్చిన యజమాని....
కానీ ఆ తర్వాత ఇంటి యజమాని మాట మార్చేశాడని వినోద్ ఆరోపిస్తున్నారు. ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన రూ.42లక్షలు కాకుండా మరింత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నట్లు గతంలో ఆరోపించారు. లేనిపక్షంలో అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులు కూడా తిరిగివ్వనని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో ఓరోజు మాట్లాడుకుందామని పిలిచి తనపై దాడికి పాల్పడ్డారని... హత్యాయత్నం చేయబోయారని ఆరోపించాడు. దీనిపై అప్పట్లో కాచిగూడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.
రెండేళ్ల తర్వాత మళ్లీ ఫిర్యాదు...
మరోవైపు అప్పట్లో ఆ ఇంటి యజమాని కూడా వినోద్పై ఆరోపణలు చేశాడు. ఆర్నెళ్లుగా ఇల్లు ఖాళీ చేయకుండా వినోద్ వేధిస్తున్నాడని... దీనిపై మాట్లాడితే కోర్టుకు వెళ్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఈ వివాదం ఇలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేసును త్వరితగతిన పరిష్కరించి తనకు న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్ వినోద్ తాజాగా డీసీపీ రమేశ్ రెడ్డిని ఆశ్రయించారు. వినోద్ ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న డీసీపీ... కేసును పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.