మెదక్ పది నియోజకవర్గాలకు 20వేల కోట్లు హరీష్ సాంక్షన్ చేయించగలడా.?ఛాలెంజ్ విసిరిన జగ్గారెడ్డి.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపైన, వ్యవస్థల పైన, ప్రజాప్రతినిధులపైన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి నిప్పులుచెరిగారు. రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ, పదవులను శాసించే పవర్ లేదని ఎద్దేవా చేసారు. మెదక్ లో ఆర్ధిక శాఖా మంత్రి ఉన్నా నిధులు సమకూర్చడంలో పూర్తిగా విఫలం చెందారని, ఆర్ధిక మంత్రిగా జిల్లాకు ఒరగబెట్టింది శూన్యమని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తేనే జిల్లా ప్రజలకు హరీష్ రావు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ బరిలో తాడోపేడో తేల్చుకుందాం..తన భార్యను అభ్యర్థిగా దింపిన జగ్గారెడ్డి
230 ఓట్లు మెదక్ లో కాంగ్రెస్ కు ఉన్నాయని, అవి కాంగ్రెస్ అభ్యర్ది గెలుపుకు ఎలాంటి దోహదం చేయవని అన్నారు. గెలిచేందుకు సరిపోయే ఓట్లు లేకున్నా తన భార్యను పోటీలో పెట్టినట్టు జగ్గారెడ్డి స్పష్టం చేసారు. కాంగ్రెస్ అభ్యర్ధిని రంగంలో దించాం కాబట్టి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లతో హరీష్ రావు ఇప్పుడు మంతనాలు జరుపుతున్నారని, మరి గత రెండు సంవత్సరాల నుంచి హరీష్ రావు ఎందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలో సత్సంబందాలు కొనసాగించలేదని సూటిగా ప్రశ్నించారు.
హరీష్ రావుకు జగ్గారెడ్డి సవాల్.. జిల్లాలో పది అసెంబ్లీ స్దానాలకు 20వేల కోట్ల తేగలవా.?
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి రెండు వేల కోట్ల చొప్పున పది నియోజకవర్గాలకు ఇరవై వేల కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు విడుదల చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేసారు. అలా విడుదల చేస్తే తన భార్యను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుంచి ఉపసంహరింపజేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేసారు. కానీ ఉమ్మడి పది జిల్లాలకు నిధులు కేటాయించే సత్తా హరీష్ రావు కు ఉందా అని జగ్గారెడ్డి ఛాలెంజ్ విసిరారు. నిర్మాలాజగ్గారెడ్డిని గెలిపిస్తే, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు 20 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే రాజా బతుకు.. టీఆర్ఎస్ కు ఓటేస్తే బానిస బతుకు.. తేల్చుకోమన్న జగ్గారెడ్డి
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవంగా ఉండాలని, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విలువ పెరుగుతుందని జగ్గన్న తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్ధిని ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పెట్టడం వల్లనే, హరీష్ రావు తమ పార్టీ ఓటర్లకు ఫోన్ లు చేస్తున్నాడని తెలిపారు. మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించి రాజు లాగా బతుకుతారో, టిఆర్ఎస్ ను గెలిపించి బానిస బతుకు బతుకుతారో మీరే తేల్చుకోవాలని ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు జగ్గారెడ్డి వినూత్న పిలుపునిచ్చారు.
వెంకట్రామిరెడ్డి అవినీతి పరుడు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్ష తప్పదన్న జగ్గన్న
వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా పదవిలో సమయంలోనే కాకుండా, జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు, జహీరాబాద్ భూముల వ్యవమారంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, నిధులను అడ్డగోలుగా దోచుకున్నాడని జగ్గారెడ్డి ఘాటుగా విమర్శించారు. అలా అవినీతి సంపాదన వెంకట్రామిరెడ్డి దగ్గర లెక్కలేనంత ఉంది కాబట్టే ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారని మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి పాల వ్యాపారం చేసో, కష్టపడి కూలి చేసే డబ్బులు సంపాదించలేదని, అవినీతి సంపాదన అని, వెంకట్రామి దగ్గర ఉన్న డబ్బంతా మెదక్ జిల్లా డబ్బులేనని, వెంకట్రామి రెడ్డి ఇచ్చిన డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సూచించారు