అసెంబ్లీ సమావేశాలకు అంటిముట్టనట్టుగా జగ్గారెడ్డి.!కాంగ్రెస్ ఎమ్మెల్యే గైర్హాజరు వెనక మతలబేంటి..?
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రోజు రోజుకూ సంస్థాగతంగా బలపడుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ ఉరకలెత్తాల్సిన తరుణంలో రోజుకో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి. కీలక నేతలు పార్టీని వీడి వెళ్లి పోవడం, ఉన్న కొద్ది మంది నేతల్లో ఏకాభిప్రాయం లేక ఎవరి దారి యమునా తీరే అన్న చందంగా తయారయ్యింది పార్టీ పరిస్థితి.
అంతే కాకుండా పార్టీలలో చురుగ్గా ఉండి కార్యకర్తలకు అంతో ఇంతో భరోసా కల్పించే నాయకుడుగా కనిపించే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కూడా జగ్గారెడ్డి అంటీముట్టనట్టు వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
బడ్జెట్ సమావేశాలకు జగ్గారెడ్డి దూరం..
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల్లో యాక్టీవ్ గా కనిపించే జగ్గారెడ్డి ఆ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో వినిపించాల్సిన తన గళాన్ని భక్తి పాటలకోసం వినియోగిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను వినిపించి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తారనుకున్న జగ్గారెడ్డి అసలు సమావేశాలకే రాకపోవడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో కనిపించని జగ్గారెడ్డి మరెక్కడికైనా వెళ్లారా అనుకుంటే పొరపాటే. ఆయన తన నియోజక వర్గంలో జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది.
జగ్గారెడ్డి వ్యవహారంపై సందేహాలు..
కాగా జగ్గారెడ్డి అసెంబ్లీ సమవేశాలకు హాజరవ్వకుండా తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే పరిమితం కావడం వెనక ప్రధాన కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని కీలక నేతలు వదిలి వెళ్లిపోయారు. ఊహించని ఈ పరిణామాలకు కార్యకర్తలు షాక్ గురయ్యారు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఎవ్వరూ ఊహించని రీతిలో పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు.ఆతర్వాత వెనువెంటనే చేవెళ్ల మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసారు. ఈ రెండు పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద కుదుపుకు కారణమయ్యాయి.
జగ్గారెడ్డి పాదయాత్రలకు బ్రేక్..
ప్రస్తుతం రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని పరితపించే కాంగ్రెస్ వాదుల్లో ముందు వరుసలో ఉండే జగ్గారెడ్డి పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కరాంలో క్షణం తీరిక లేకుండా ఉన్నారనుకున్నా, బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరుకానంత బిజీగా ఉన్నారా అనే ప్రశ్న కార్యకర్తల నుండి ఉత్పన్నమవుతోంది. బడ్జెట్ సమావేశాల ముందునుండే గాంధీ భవన్ గానీ, సీఎల్పీకి గాని రాకుండా మొహం చాటేసారు జగ్గారెడ్డి. ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని పార్టీ శ్రేణులు జగ్గారెడ్డి బడ్జెట్ సమావేశాలకు రాకపోడంతో అసలేం జరుగుతోందని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
బడ్జెట్ సమావేశాలకు రాకపోవడానికి కారణం ఏంటి..?
జగ్గారెడ్డి వ్యవహారంపై పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేశకులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలతో పాటు రైతు సమస్యలను ఎత్తిచూపుతూ జగ్గారెడ్డి రెండు సార్లు సంగారెడ్డి నియోజక వర్గంనుండి హైదరాబాద్ వరకు పాదయాత్రకు సన్నాహాలు చేసారు జగ్గారెడ్డి. కాని రెండు సార్లు అనూహ్యంగా తన పాద యాత్ర వాయిదా పడుతూ వచ్చింది. మొదటి సారి పోలీసులు శాంతి భద్రతల సమస్యపేరుతో యాత్రకు అనుమతించలేదని స్వయంగా జగ్గారెడ్డే వివరణ ఇచ్చారు. రెండోసారి ఎందుకు పాదయాత్రకు బ్రేకులు పడ్డాయో మాత్రం ఎవ్వరికి తెలియదు. తను శ్రీకారం చుట్టిన యాత్రకు పార్టీనుండి సరైన సహకారంలేక ఆయన రెండోసారి తలపెట్టిన యాత్రకు అవరోధాలు కలిగాయేమోననే చర్చ జరుగుతోంది. అందుకే పార్టీ వ్యవహారాలకు, శాసన సభ సమావేశాలకు దూరంగా ఉంటున్నారనే చర్చ కూడా పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. అదేంకాదు అనుకుంటే మిగిలిన నాలుగు రోజుల సభకైనా జగ్గారెడ్డి హాజరువుతారా లేదా అన్నది చూడాలి.