14 ఏళ్లుగా హరీశ్ రావుతో మాటల్లేవు.. ప్రజా సంక్షేమం కోసం తప్పలేదు : జగ్గారెడ్డి
సంగారెడ్డి : 14 ఏళ్లుగా మంత్రి హరీశ్ రావుతో మాటల్లేవని చెప్పుకొచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రజా సంక్షేమం కోసం మళ్లీ ఆయనతో మాట్లాడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. పార్టీలకు, వ్యక్తులకు తల వంచబోనని.. కేవలం ప్రజల ముందే తల వంచుతానని స్పష్టం చేశారు. సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను తీరుస్తానంటూ హామీ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తే బతికినన్ని రోజులు ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు. బుధవారం నాడు దసరా వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలు ప్రస్తావించారు.
నవంబర్ ఒకటో తేదీ నుంచి తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎవరికైనా సమస్యలుంటే నేరుగా తన ఇంటికొచ్చి ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం తప్ప తనకు మరొకటి తెలియదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజా ప్రతినిధిగా నియోజక వర్గ ప్రజలకు సేవలందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల బాధలు తీర్చడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు వారికి సేవ చేయాలని.. మరణించిన తర్వాత ఫోటోలకు ఎంత పెద్ద దండ వేసిన లాభం లేదన్నారు. తాను ఇంతవాడిగా ఎదగడానికి తన తల్లి ముఖ్య కారణమన్నారు. అయితే తనకు ఆస్తిపాస్తులు అంతగా లేవన్న జగ్గారెడ్డి.. కోట్లాది రూపాయల అప్పు ఉందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications