గులాబీ గూటికి మాజీ మంత్రి జలగం ప్రసాదరావు?
ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, మాజీ రాష్ట్ర మంత్రి జలగం ప్రసాదరావు అధికార టిఆర్ఎస్లోకి రానున్నారు. ఖమ్మం కాంగ్రెస్లో చక్రం తిప్పిన ప్రసాదరావు గత కొన్నేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే నిత్యం తన స్వగ్రామమైన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామానికి వచ్చిపోతూ తన అనుచర వర్గంతో సంప్రదింపులు, చర్చలు జరుపుతూనే ఉన్నారు.
రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ జిల్లాలో గట్టిపట్టున్న నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన సోదరుడైన వెంకట్రావు ప్రస్తుతం టిఆర్ఎస్ తరఫున కొత్తగూడెం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితుడిగా పేరున్న ప్రసాదరావును టిఆర్ఎస్లోకి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయి పదవిని ఇవ్వనున్నట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రత్యేక కార్పోరేషన్ను ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా జలగం ప్రసాదరావును నియమించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తుమ్మల ఇటీవల ప్రసాదరావు ఇంటికెళ్ళి టిఆర్ఎస్లోకి ఆహ్వానించడమే కాకుండా ముఖ్యమంత్రి కెసిఆర్తో మాట్లాడించినట్లు సమాచారం. అటు తుమ్మల కూడా వెంకట్రావుకు చెక్ పెట్టేందుకు ప్రసాద్రావును పార్టీలోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా జిల్లాలో టిఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాలో గట్టి పట్టున్న నేతగా పేరొందిన ప్రసాదరావును తీసుకొచ్చేందుకు వ్యూహం పన్నినట్లు ఆ పార్టీ నేతలు కూడా చెబుతున్నారు.