ఖమ్మం యార్డులో మళ్లీ ఉద్రిక్తత: అధికారులపై కాంగ్రెస్ దాడికి యత్నం, టీఆర్ఎస్ ఘర్షణ
ఖమ్మం: మిర్చి మార్కెట్ యార్డులో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రస్ నేతల జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీ హనుమంతరావు తదితరులు సోమవారం ఉదయం మార్కెట్ యార్డును పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. కాగా, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
'మీరు వ్యాపారస్తులా.. టీఆర్ఎస్ కార్యకర్తాలా' అంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, తమ వారిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ పలువురు రైతుల కుటుంబసభ్యులు కాంగ్రెస్ నేతలకు విన్నవించారు.

పార్టీలతో సంబంధం లేకుండానే...: జానారెడ్డి
మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం వల్లే ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండానే రైతులు ఆందోళన చేస్తున్నారని తెలిపారు. కేంద్ర సహకారంతోనే కందులకు గిట్టుబాటు ధర లభించిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు చేసిందేమీ లేదని చెప్పారు.

రైతుల సమస్యలు తీర్చండి
మిర్చి పంటకు రూ.3వేల ధర ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. రైతుకు పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జానా రెడ్డి డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ఏజెంట్లు: భట్టి
మార్కెట్ యార్డ్ అధికారులు ప్రభుత్వం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇప్పుడు వీళ్లంతా టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారని అన్నారు. మద్దతు ధర కల్పించకుండా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

దొంగలంటారా?: వీహెచ్ ఆగ్రహం
రైతులను దొంగలనడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు మార్కెట్ యార్డు దళారులకు అమ్ముడుపోయిందని అన్నారు. వ్యాపారస్తులు డబ్బులు పంచుకుంటున్నారని ఆరోపించారు. మళ్లీ తమ ప్రభుత్వం వస్తుంది.. జాగ్రత అంటూ అధికారులను వీహెచ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications