మంత్రుల్ని తప్పుబట్టిన జానా, అభిమానులు అర్థం చేసుకోవాలి, సభలో నవ్వులు
హైదరాబాద్: రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదన్న వాదనను ఖండిస్తున్నామని జానా రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అన్నారు. కొందరు మంత్రులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పైన జానారెడ్డి చర్చను ప్రారంభించారు.
అధికారం శాశ్వతం కాదని, ప్రజలకు మేలు చేయడమే మన పని అన్నారు. మేం పైపులు వేయకుంటే గజ్వెల్ నియోజకవర్గానికి నీళ్లు వెళ్లేవా అని నిలదీశారు. ప్రజల ఆకాంక్షలను తెరాస ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం లేకుంటే తెలియజేసే బాధ్యత ప్రతిపక్షాలది అన్నారు.
ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పడం నియంతృత్వం అవుతుందన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే చాలు మార్పు వస్తుందని ప్రజలు ఆశించారని జానారెడ్డి అన్నారు. ఆ విధంగానే కొత్త ప్రభుత్వం ముందుకు పోవాల్నారు. గతంలో అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయన్నారు.
తెరాస పార్టీ తమ ఆకాంక్షలను నెరవేరుస్తుందని ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. దానిని కూడా తాము స్వాగతించామన్నారు. ప్రజలు ఆశించినట్లుగా ప్రభుత్వం పని చేస్తే సహకరిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో మరో పార్టీ ఉండకూడదని పలువురు మంత్రులు మాట్లాడారని, అలా మాట్లాడటం సరికాదన్నారు.
ఇలా చేయడానికే వచ్చారా, లేక ప్రజల కోసం పని చేసేందుకు వచ్చారా అని నిలదీశారు. ప్రజాస్వామ్య ముసుగులో ఇది నియంతృత్వం అన్నారు. అయినా తాము సర్దుకు పోతున్నామని చెప్పారు. వారు ఎన్ని మాట్లాడితే అంతకు రెట్టింపు మాట్లాడగలమని, కానీ సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.
ఒకప్పుడు ఒక్కతిగా ఉన్న జయలలిత ఇప్పుడు పరిపాలన చేస్తోందన్నారు. కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బిజెపి నేడు దేశాన్ని పాలిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
మాట్లాడితే ఓ బాధ, లేకుంటే మరో బాధ
దూకుడుగా మాట్లాడితే ఓ బాధ, మాట్లాడకుంటే మరో బాధ అని జానా రెడ్డి అన్నారు. పరుషపదజాలంతో ఉపయోగం లేదని, తన అభిమానులు అర్థం చేసుకోవాలన్నారు. సభలో సీఎం, మంత్రులు లేకపోవడాన్ని జానారెడ్డి తప్పుబట్టారు. వారు మండలికి వెళ్లినట్లు టిఆర్ఎస్ చెప్పారు.
నవ్వులు పూయించిన జానా
బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళమైన అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటెల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని జానారెడ్డి అన్నారు. ఈ లెక్కలు చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యేలు చదువుకోవాలని చెప్పారు. దీంతో అందరూ నవ్వేశారు.
సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయారా అని తెలంగాణ మాండలికంలో అడగటంతో సభలో నవ్వులు విరబూశాయి. తాను ఎంత చేసినా అంచనా వేసి చెప్పానే, అంత మేరకే ఈటెల బడ్జెట్ కేటాయింపు చేశారన్నారు. మిషన్ కాకతీయ నిధుల విషయంలో కూడా అదే జరిగిందన్నారు.
టిడిపి పెరగదు
పాలేరులో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెరుగుతుందేమో కానీ తెలుగుదేశం మాత్రం పెరగదని జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం పైన తమకు సమాచారం లేదని భారతీయ జనతా పార్టీ నేత కిషన్ రెడ్డి అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం తెలిసిందే. దీనికి విపక్షాలతో కలిసి వెళ్తామని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.