కొత్త నోట్లు పంచిన జనసేన, అయిపోవడంతో.. మళ్లీ వస్తామని..:ఆసుపత్రి వర్గాల షాక్!
నోట్ల రద్దు, రెండు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో ఆసుపత్రులలోని రోగుల ఇబ్బందుల దృష్ట్యా జనసేన కార్యకర్తలు ఆదివారం నిమ్స్ ఆసుపత్రిలో పండ్లు, మందులతో పాటు కొత్త కరెన్సీ నోట్లు ఇచ్చారు.
హైదరాబాద్: జనసేన పార్టీ కార్యకర్తలు తమ మంచి మనసును చాటుకుంటున్నారు. శని, ఆదివారాలు బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలోని రోగులు ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆసుపత్రిలో పండ్లు, మందులు పంపిణీ చేసారు.
నోట్ల రద్దు, రెండు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఆసుపత్రులలోని రోగుల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న జనసేన కార్యకర్తలు ఆదివారం నిమ్స్ ఆసుపత్రిలో పండ్లు, మందులు పంచి పెట్టారు.
అనంతరం కొందరు రోగుల నుంచి పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకొని, కొత్త నోట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు కావడంతో రోగులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో తమవంతు సహకారం అందించామన్నారు. పాత నోట్లను మార్చుకునే వీలు లేకపోవడంతో తాము కొత్త నోట్లను ఇచ్చామని చెప్పారు.
గందరగోళం నెలకొంటుందని..
నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు ఎదురుగా ఉన్న రెస్ట్ హౌస్లలో పేద రోగుల కుటుంబ సభ్యులకు రూ.500, రూ.1000 నోట్లకు చిల్లర ఇచ్చి జనసేన కార్యకర్తలు ఆదుకున్నారు. ఈ విధంగా సుమారు రూ.25వేల వరకు చిన్న నోట్లు పంపిణీ చేశారు.
నోట్లు మార్చుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. తెచ్చిన చిన్ననోట్లు అయిపోవడంతో మళ్లీ వస్తామని కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే నోట్ల మార్పిడి వల్ల ఆస్పత్రి ప్రాంగణంలో గందరగోళం నెలకొనే అవకాశముందని, అందువల్ల ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆసుపత్రి వర్గాలు వారికి సూచించాయి.
పెద్ద నోట్ల రద్దు మంచిదే: ఈటెల
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అయితే ఈ నిర్ణయం అమలులో లోపాల గురించే తాము ఆందోళన చెందామన్నారు. లోపాలను సరిదిద్దుకోవాలన్నారు.
ప్రజాజీవనం సజావుగా సాగేలా, వ్యాపార లావాలదేవీలు జరిగేలా చూడాలని కేంద్రానికి చెప్పామని తెలిపారు. శనివారం స్టాకర్లు, డిస్ట్రిబ్యూటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని ప్యాప్సీలో జరిగిన సదస్సుకు మంత్రి ఈటెల హాజరై ప్రసంగించారు.
విడిపోతే పడిపోతామన్నవాళ్లు అబ్బురపడేలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సమయంలో ఈ నోట్ల మార్పిడి వచ్చిపడిందని, దీని నుంచి గట్టెంక్కేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశమంతా ఒకే ట్యాక్స్ విధానం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజల నుంచి ట్యాక్స్లు వసూలు చేసేది కాదన్నారు.