కొండగట్టు నుంచి పవన్ రాజకీయం ఎందుకంటే, 2 కారణాలు: ఆ రోజు ఇదీ జరిగింది?
హైదరాబాద్/అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామికి పూజలు చేసి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయనున్నారు. మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆయన అంజన్నకు పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆయన ప్రజల్లోకి కూడా వెళ్లనున్నారు. దీనికి సమయం తీసుకునే అవకాశాలున్నాయి.
పవన్ కొండగట్టు అంజన్నకు పూజలు చేసి తాను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావడానికి కారణం కూడా చెప్పారు. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో తనకు ప్రమాదం జరిగిందని, అప్పుడు అంజన్న వల్లే బతికిబయటపడ్డానని చెబుతున్నారు. మరోవైపు ఆంజనేయస్వామి తమ ఇలవేల్పు అన్నారు. అందుకే రాజకీయాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

2009లో పవన్ కళ్యాణ్ దూకుడు
ఈ నేపథ్యంలో 2009లో జరిగిన ప్రమాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అప్పుడు పవన్ కళ్యాణ్ యువ రాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో ఆ పార్టీపై పవన్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని పంచెలు ఊడదీసి కొడతా అన్న పవన్ డైలాగ్ ఇప్పటికీ ఇతర నాయకులు ప్రస్తావిస్తుంటారు.

ప్రజా అంకిత యాత్ర రథంపై అభివాదం చేస్తూ
ఇందులో భాగంగా ఆయన ఉత్తర తెలంగాణలో పర్యటించారు. అభిమానుల మధ్య యాత్ర సాగిస్తూ వెళ్తున్న పవన్కు పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ వద్ద భోజనం చేసి ప్రజా అంకిత యాత్ర రథం పైకెక్కి అభిమానులకు అభివాదం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తలకు తాగిన విద్యుత్ లైన్
ఇంతలో 11కేవీ విద్యుత్ లైన్ పవన్ కళ్యాణ్ తలకు తాకింది. అంతే ఆయన వాహనంలోనే ఒరిగిపోయారు. కింద కూర్చుని స్పృహ తప్పారు. గాయపడ్డ పవన్కు సిబ్బంది సపరిచర్యలు చేశారు. ఊరు బయట కాన్వాయ్ ఆపి, అర గంట పాటు చికిత్స అందించారు.

ఫోన్లో మాట్లాడిన చిరంజీవి
ఆ తర్వాత వెంటనే తేరుకుని పవన్ కళ్యాణ్ యాత్రను కొనసాగించారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని తలుచుకుని యాత్రను తిరిగి ప్రారంభించారు. పవన్తో ఆయన అన్న చిరంజీవి ఫోన్లో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు. తనకు ఏమీ కాలేదని చెప్పారు.

చావు అంటే భయం లేదని
ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మైకు తీసుకొని ప్రసంగం ప్రారంభించారు. వెంటనే తనకు చావంటే భయం లేదని, ఇప్పుడే చావును చూసొచ్చానని చెప్పారు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

అందువల్లే నాటి ప్రమాదం
వాహనం ఎత్తు ఎక్కువగా ఉండటం, మారు మూల ప్రాంతాల్లో వైర్లు కిందకు వేలాడుతూ ఉండటం వల్లే పవన్ తలకు వైర్లు తాకాయి. అప్పటి నుంచి తనను అలా ప్రాణాల నుంచి కాపాడింది కొండగట్టు అంజన్నే అని పవన్ గట్టిగా నమ్మారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ అని ఆయన అభిమానులు చెప్తుంటారు. తొమ్మిదేళ్ల తర్వాత పవన్ మళ్లీ రాజకీయంగా కొండగట్టు లోకి అడుగు పెట్టబోతున్నారు.












Click it and Unblock the Notifications