సాగర్ ఉపఎన్నిక: కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహమదే... జానారెడ్డి గెలిస్తే పార్టీలో కీలక పరిణామాలు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీపై కీలక ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పీసీసీ చీఫ్ పదవిపై సాగర్ ఉపఎన్నిక ఫలితం ఎక్కువగా ప్రభావం చూపించవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చాలా కాలంగా పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... సాగర్ ఉపఎన్నిక తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉపఎన్నికలో సీనియర్ నేత జానారెడ్డి విజయం సాధిస్తే... ఆ పదవి ఆయనకే కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎటూ తేల్చుకోలేని స్థితిలో.. జానారెడ్డి వైపు మొగ్గు...
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాల రీత్యా పీసీసీ పదవిపై ఏకాభిప్రాయం సాధ్యం కావట్లేదు. మొదటి నుంచి పార్టీ జెండా మోసినవారికే పీసీసీ పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఒకవైపు... ఎప్పుడొచ్చామన్న దానితో సంబంధం లేకుండా నాయకుడి ఛరిష్మాను చూసి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మరోవైపు... ఇలా రెండింటి నడుమ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో జానారెడ్డికి ఆ పదవికి కట్టబెడితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని... ఆయనైతే ఎవరూ వ్యతిరేకించరని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జానారెడ్డి గెలిస్తే ఆయన సారథ్యంలోనే...
సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రానికి మళ్లీ పునర్వైభవం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కాబట్టి సాగర్ ఉపఎన్నికలో గెలిచే పక్షంలో జానారెడ్డికే కాంగ్రెస్ పగ్గాలు అప్పగించి 2023 ఎన్నికలకు ఆయన సారథ్యంలోనే సన్నద్దమయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం టెన్ జన్పథ్లోనూ దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా జానారెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయమై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత కావడంతో జానారెడ్డికి ఆ పదవి అప్పగిస్తే కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు తెరపడుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ పదవే సరైనదని...
ఏడుసార్లు ఎమ్మెల్యేగా,సుదీర్ఘ కాలం పాటు మంత్రిగా,గతంలో సీఎల్పీ నేతగా జానారెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సాగర్లో జానారెడ్డి గెలిస్తే పార్టీలోనూ ఆయనకు పెద్ద పదవి ఇవ్వాల్సిందే. ప్రస్తుతం సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు కాబట్టి... ఆయన స్థానాన్ని కదిలించకపోవచ్చు. దళిత నేతను ఆ పదవి నుంచి తొలగించి జానారెడ్డికి ఆ పదవి అప్పగిస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయి కాబట్టి ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు. కాబట్టి ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడమే సరైనదని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేలా...
వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఆ పదవి కట్టెబట్టాలని అధిష్టానం భావించినప్పటికీ పలువురు నేతలు బాహాటంగానే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రేవంత్కు పీసీసీ ఇచ్చే పక్షంలో పార్టీనే వీడుతామని హెచ్చరించారు. రేవంత్కు పోటీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నవారే. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పీసీసీ పదవిపై ఏకాభిప్రాయం సాధ్యం కాదని అధిష్ఠానం ఫిక్స్ అయిపోయింది. అందుకే సాగర్ ఉపఎన్నిక వరకూ దాన్ని పక్కనపెట్టాలని నిర్ణయించింది. సాగర్లో జానారెడ్డి గెలిస్తే... ఆయన్నే పీసీసీ చీఫ్ను చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనైతేనే అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లగలరని... పెద్దాయన చెప్తే ఎవరైనా వినాల్సిందేనని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.