శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై పవన్ కల్యాణ్ రియాక్షన్....
శ్రీశైలం పవర్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది మృతి చెందడటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటన అని.. 9 మంది మృత్యువాత పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
శ్రీశైలం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ,రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. డీఈకి రూ.50లక్షలు,మిగతా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని... అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేట్ సంస్థ అమరరాజా ఉద్యోగులకు సైతం మానవతా దృక్పథంతో రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కాగా,గురువారం రాత్రి 10.30 గంటలకు పవర్ ప్లాంట్ ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగలు పవర్ ప్లాంట్ను కమ్మేయడంతో విధుల్లో ఉన్న 17 మంది ఉద్యోగులు అందులోనే చిక్కుకుపోయారు. ఇందులో 8 మంది ఉద్యోగులు ఎస్కేప్ టన్నెల్స్ నుంచి బయటపడ్డారు.
ఈ క్రమంలో ఆరుగురికి గాయాలయ్యాయి. మిగతా వాళ్లు మాత్రం అందులోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ తర్వాతే ప్రమాద కారణాలు బయటపడుతాయని... అప్పటివరకూ దానిపై ఏమీ మాట్లాడలేమని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.