తెలంగాణలోనూ జనసేన జెండా ఎగురుతుంది, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కౌలు రైతులను పరామర్శించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. శుక్రవారం తెలంగాణలోని పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఇటీవల మృతి చెందిన జనసేన కార్యకర్తలు సైదులు, శ్రీనివాసరావు కుటుంబాలను పరామర్శించారు.
Recommended Video


తెలంగాణలో 30 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తాం: పవన్ కళ్యాణ్
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీచేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రతి నియోజకవర్గంలో 5 వేలకుపైగా ఓట్లున్నాయని అన్నారు. తెలంగాణలోనూ రాజకీయాలను జనసేన శాసిస్తుందని చెప్పారు. ఇక్కడ కూడా తమ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందన్నారు. తాను తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్లోనూ అధికారం కోరుకుంటున్నాం: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్లో అధికారం కోరుకుంటున్నామని, ఆశయం కోసం నిలబడేవాడికి ఓటమి ఉండదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఎన్నికల పొత్తులపై సమాధానం దాటవేశారు. కార్యకర్త శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ కోదాడకు బయలుదేరారు. జనసేన కార్యకర్తలకు వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన సైదులు, శ్రీనివాస్ కుటుంబాలకు జనసేన ఎప్పుడు అండగా నిలుస్తుందన్నారు.

ఏపీ జన్మనిస్తే.. తెలంగాణ అండగా నిలిచింది: పవన్ కళ్యాణ్
తనకు జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే అండనిచ్చింది మాత్రం తెలంగాణ అభిమానులేనని తెలిపారు. ముందుగా చౌటుప్పల్ మండలం లక్కారానికి చెందిన సైదులు కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. జనసేన పార్టీ అండగా ఉంటుందని హామి ఇచ్చారు. సైదులు భార్యకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. కొద్ది రోజుల క్రితం సైదులు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కాగా, చౌటుప్పల్ నుంచి లక్కారం వరకు పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్లారు. పవన్ కళ్యాణ్ రాకతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications