గిన్నిస్ బుక్లో జనగామ: సంఘటిత సబల శక్తి రికార్డు
జనగామ జిల్లాను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా, సమన్వయంతో పనిచేసి తెలంగాణ రాష్ట్రంలోనే జనగామను ప్రథమ స్థానంలో నిలపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు.
జనగామ: జనగామ జిల్లాను అధికారులు, ప్రజా ప్రతినిధులు సమష్టిగా, సమన్వయంతో పనిచేసి తెలంగాణ రాష్ట్రంలోనే జనగామను ప్రథమ స్థానంలో నిలపాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. మంగళవారం పట్టణంలోని ధర్మకంచలో ఉన్న మినీ స్టేడియంలో కలెక్టర్ ఎ. శ్రీదేవసేన ఆధ్వర్యంలో విద్యార్థినిలతో నిర్వహించిన సంఘిటిత సబల ఆత్మ రక్షణ విద్య (మార్షల్ ఆర్ట్స్) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జనగామలో అధికారులు, కలెక్టర్ చొరువతో బాలికల మార్షల్ ఆత్మరక్షణ విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయడం జనగామకు గొప్ప పేరు తెచ్చి పెట్టిందన్నారు. అంతేకాకుండా గతంలో ఎక్కడ లేని విధంగా 13,683 బాలికలతో ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రపంచ రికార్డు సాధించడం అభినందనీయం అన్నారు. ఈ మహా ప్రదర్శనకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేనతోపాటు నిర్వాహకులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కలెక్టర్ శ్రీదేవసేనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జనగామ వరంగల్ హైదరాబాద్కు మధ్యలో ఒక ప్రత్యేక అభివృద్ధి జిల్లాగా ఏర్పడనున్నదని అన్నారు. పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ బాలికల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను జనగామలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనార్టీ బాలికల కొరకు మండల స్థాయిల్లో వంద గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

జనగామ సంఘిత సబల మహా ప్రదర్శనకు గిన్నిస్ రికార్డు
జనగామలోని మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన సంఘటిత సబల మహా ప్రదర్శన గిన్నిస్ బుక్లో చోటు సంపాదించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. నిరాటంకంగా 36 నిమిషాలపాటు 13,683 మంది విద్యార్థినులు చేసిన ఆత్మరక్షణ విద్యా ప్రదర్శనకు గాను గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకున్నట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధి జయసింహా వేదిక పై ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ ఎ. శ్రీదేవసేన మదిలో మెదిలిన ఈ ఆలోచనకు గిన్నిస్ రికార్డు సాధించడం జనగామ పట్టణానికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. బాలికలకు ఆత్మ స్థైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖాధికారులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల కృషితో ఈ రికార్డు లభించింది. గత నెల రోజులుగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలో మెలకువల శిక్షణ ఇప్పించారు.
ఈ ప్రదర్శనను నిర్వహించి విజయవంతం చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, మార్షల్ విద్యలో నైపుణ్యం కలిగిన వారితో బాలికలకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థినులు ఉదయం 9 గంటలకు మినీ స్టేడియంకు చేరుకొని ఎండను సైతం లెక్క చేయకుండా ప్రదర్శను ఇచ్చారు.












Click it and Unblock the Notifications