జయరాం హత్య వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరీ వీణ!?: శిఖాచౌదరికి అందని నోటీసులు!
హైదరాబాద్: ఎన్నారై వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ఏపీ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ జయరాం సతీమణి పద్మశ్రీ హైదరాబాదులో ఫిర్యాదు చేయడం, శిఖా చౌదరి పాత్ర ఉందని ఆమె అనుమానాలు లేవనెత్తడం, మరోవైపు ఏపీ పోలీసులు శిఖ పాత్ర లేదని చెప్పడంతో కేసు కొలిక్కి రాలేదని అంటున్నారు. హైదరాబాద్ పోలీసుల విచారణ అనంతరం అన్ని విషయాలు తేలుతాయని చెబుతున్నారు.
'శిఖా చౌదరి హైఫైలైఫ్, పేదమ్మాయి బీఎండబ్ల్యులో తిరిగేస్థాయికి ఎలా ఎదిగింది?'
ఆ డబ్బులు కీలకంగా మారాయి
జయరాం హత్యకు ప్రధాన కారణంగా చెబుతున్న రూ.4 కోట్లకు పైగా డబ్బులు ఎవరివి అనే అంశం కీలకంగా మారింది. అంత మొత్తం కీలక నిందితుడు రాకేష్ రెడ్డికి సంబంధించిందేనా? వాటిని ఎలా సంపాదించాడు లేక ఎలా సేకరించాడు? అనే అంశాలు తేలాల్సి ఉంది. కేసును ఏపీ నుంచి హైదరాబాద్కు బదిలీ చేసిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వీటిపై దృష్టి సారించారు. రాకేష్ రెడ్డితోపాటు మరో నిందితుడు శ్రీనివాస్ను పీటీ వారెంట్పై తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని పంపించారు. అక్కడి జైలు అధికారులు స్థానిక కోర్టు అనుమతిస్తేనే పంపుతామని చెప్పింది. దీంతో సోమవారం నందిగామ కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
హత్యకు డబ్బులే కారణమా, మరేదైనా ఉందా?
నిందితులను హైదరాబాద్కు తీసుకు వచ్చి ఇక్కడి కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. వారిని విచారించిన తర్వాతనే కేసు కొలిక్కి రానుందని చెబుతున్నారు. గత మూడేళ్లలో రాకేష్ రెడ్డి రూ.4 కోట్లకు పైగా మొత్తాన్ని జయరాంకు ఇచ్చారని చెబుతున్నారు. ఈ అంశంలోనే హత్య జరిగిందని పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలింది. హత్య తర్వాత పోలీసులతోను మాట్లాడినట్లుగా తేలింది. ఈ హత్యకు డబ్బులే కారణమా, మరేదైనా కారణం ఉందా, తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలోను విచారించనున్నారు.
వీణ ఎవరు?
ఈ హత్య కేసులో శిఖా చౌదరి పాత్ర ఉండి ఉంటుందని జయరాం సతీమణి పద్మశ్రీ చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా మరో యువతి పేరు తెరపైకి వచ్చింది. అయితే జయరాంను తన ట్రాప్లో పడేసేందుకు రాకేష్ రెడ్డి అమ్మాయి పేరుతో చాటింగ్ చేశాడు. ఆ పేరు వీణ. ఈ పేరునే జయరాంతో చాటింగ్ చేసేందుకు ఎందుకు ఎంచుకున్నాడనే కోణంలోను దర్యాఫ్తు చేయనున్నారని తెలుస్తోంది. ఆ పేరు ఉన్న మహిళతో ఎవరితోనైనా పరిచయాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందని చెబుతున్నారు.
శిఖాచౌదరికి అందని నోటీసులు
గత నెల 31వ తేదీన జయరాం శిఖా చౌదరికి ఫోన్ చేసి రూ.కోటి అడిగినట్లు చెబుతున్నారు. రాకేష్, జయరాంల మధ్య వ్యవహారాలన్నీ తెలిసిన శిఖా చౌదరి ఎందుకు మౌనంగా ఉన్నారనేది కూడా తెలియాల్సి ఉందని చెబుతున్నారు. హత్య అనంతరం రాకేష్ ఎవరెవరికి ఫోన్లు చేశాడో తెలియాల్సి ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, తనకు పోలీసుల నుంచి నోటీసులు అందలేదని, తనను పిలిస్తే విచారణకు సహకరిస్తానని శిఖాచౌదరి చెబుతున్నారు.