జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ.. ఏపీ పోలీసుల సంచలన నిర్ణయం
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసులకు కేసు బదిలీ చేస్తూ.. ఏపీ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య న్యాయపరమైన చిక్కులు సృష్టించి తప్పించుకోవాలనుకున్న హంతకుల మైండ్ గేమ్ కు చెక్ పడింది. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. హత్య హైదరాబాద్ లో జరగడంతో తెలంగాణ పోలీసులకు ఈ కేసును బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అడుగు ముందుకు
జయరామ్ హత్యకేసులో శిఖా చౌదరి ప్రమేయంపై ఏపీ పోలీసులు నిర్ధారించకపోవడంతో ఆయన భార్య పద్మశ్రీ.. తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక తర్జనభర్జన పడుతున్న తెలంగాణ పోలీసులకు.. ఏపీ పోలీసుల నిర్ణయం ఊరట కలిగించింది. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు మార్గం సుగమమైంది.
బదిలీతో న్యాయం జరిగేనా?
జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో ఏపీ పోలీసులు.. ఈ కేసును తెలంగాణ పోలీసుకు బదిలీ చేశారు. ఆయన హత్యకు సంబంధించి మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు పద్మశ్రీ.. ఏపీలో ఆ కేసు ఉంటే శిఖా చౌదరి తప్పించుకుంటుందనే వాదనలు కూడా తెరపైకి తెచ్చారు. ఆ క్రమంలో మంగళవారం రాత్రి జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. అయితే జయరామ్ ను హైదరాబాద్ లో హత్య చేసిన రాకేశ్ రెడ్డి.. ఈ కేసు నుంచి తెలివిగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆయన మృతదేహాన్ని ఏపీకి తరలించాడు. వీటన్నంటి నేపథ్యంలో ఈ కేసును తెలంగాణ పోలీసులకు బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అందుకేనా బదిలీ?
జయరామ్ హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డికి ఏపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయనే కోణంలో.. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేయడమే బెటర్ అని ఏపీ ప్రభుత్వం భావించినట్లుంది. హత్య తెలంగాణలో జరగడం, ఈ విషయంపై దుమారం రేగడం.. ఇదంతా కూడా ఏపీ ప్రభుత్వం ఇరుకున పడకుండా ఉండేందుకే కేసు బదిలీ జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జయరామ్ భార్య పద్మశ్రీ ఆరోపణల నేపథ్యంలో కేసును బదిలీ చేయడమే ఉత్తమమని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ కేసు ద్వారా తలనొప్పులు ఎందుకన్నట్లుగా ఏపీ సర్కార్ ఆచితూచి వ్యవహరించి జయరామ్ హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిందనే టాక్ నడుస్తోంది.