త్వరలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న జయసుధ?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ తెలుగు నటి జయసుధ తన సొంత పార్టీ వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయసుధ టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.
జయసుధ కుమారుడు శ్రేయాన్ నటించిన ‘బస్తీ' సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హాజరయ్యారు.
ఈ నేపథ్యం జయసుధ టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న వార్తలకు బలం చేకూరినట్లయింది. కాగా, టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే వార్తలపై జయసుధ స్పందిస్తూ.. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇంఛార్జీగా ఎవరిని నియమించినా తనకు అభ్యంతరం లేదని తెలిపారు.
ఒక వేళ ఆహ్వానం వస్తే పరిశీలిస్తానని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు కూడా టిఆర్ఎస్ పార్టీలో కొనసాగే కొత్త ఒరవడికి శ్రీకారం పడనుంది. కాగా, జయసుధను తమ పార్టీలో చేర్చుకునే అంశంపై ఇప్చపటి వరకు చర్చ జరగలేదని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు.
ఇది ఇలా ఉండగా, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జయసుధపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేగాక, టిఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలియడంతో కాంగ్రెస్ నుంచి జయసుధను సస్పెండ్ చేసే యోచనలో టిపిసిసి ఉన్నట్లు తెలుస్తోంది.