శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ జేసీ: బస్సుల పంచాయితీపై సవాల్.. టైమ్ ఫిక్స్!
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్-టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బస్సుల పంచాయితీకి సంబంధించిన మాటల యుద్దం నడుస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా బస్సులకు సంబంధించిన పంచాయితీ తెరపైకి వచ్చింది. తెలంగాణ బస్సులపై ఏపీలో అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తుంటే.. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయి కాబట్టే ఆ బస్సులను సీజ్ చేశారని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
శ్రీనివాస్ గౌడ్ ఏమంటున్నారంటే!
శుక్రవారం నాడు ఇదే అంశంపై సహచర ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, ఆలె వెంకటేశ్వర్రెడ్డి, దుర్గం చిన్నయ్యలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్ లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఏపీకి చెందిన బస్సులు తెలంగాణలో ఎన్ని తిరుగుతున్నాయో అదే నిష్పత్తిలో తెలంగాణ బస్సులను కూడా ఏపీలో తిరగనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రస్తావించారు శ్రీనివాస్ గౌడ్. జేసీ లాంటి దౌర్జన్యం చేసే నేతలు ఉండటం వల్లే తెలంగాణ ప్రజలు రాయల తెలంగాణకు ఒప్పుకోలేదని పేర్కొన్నారు. పాలెంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటనలో 45మంది మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆలె వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
పాలెం దుర్ఘటనలో నిందితులుగా ఉన్న జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి విజ్ఞతతో వ్యవహరించాలని ఈ సందర్బంగా గువ్వల బాలరాజు హితవు పలికారు. జేసీ ప్రభాకర్రెడ్డి 27వ తేదీన హైదరాబాద్ వస్తే అన్ని ఆధారాలతో తాము సిద్ధంగా ఉంటామని దుర్గం చిన్నయ్య అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వాదన మరోలా!:
దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయని నిరూపిస్తే తన 44 బంద్ లను రోడ్డుపైకి రాకుండా బంద్ చేస్తానని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, రవాణా చట్టాలకు లోబడే దివాకర్ ట్రావెల్స్ కు చెందిన బస్సులు నడుస్తున్నాయని అన్నారు.
మాట్లాడాల్సిన ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నా.. వాటన్నింటిని పక్కనబెట్టి టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అసెంబ్లీ వేదికగా దివాకర్ ట్రావెల్స్ పై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు జేసీ.
ఆరంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ నిబంధనలను ఖాతరు చేయకుండా ఏపీలో బస్సులు నడుపుతున్నారని, అది గుర్తించే అక్కడి ఆర్టీఏ అధికారులు ఆ బస్సులను సీజ్ చేశారని ప్రభాకర్రెడ్డి తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిని వెనకేసుకొచ్చేందుకు చట్ట సభల్లో సమయాన్ని ఉపయోగించుకోవడం సరికాదన్నారు.
సునీల్ నిర్వహిస్తున్న అక్రమాలకు సంబంధించి ఆధారాలతో సహా ఈ నెల27న ఉదయం 10గం.లకు తెలంగాణ ఎస్టీఏ వద్దకు వస్తానని, అదే సమయానికి శ్రీనివాస్ గౌడ్ కూడా అక్కడికి వచ్చి ఆరోపణలను నిరూపించాలని జేసీ సవాల్ చేశారు.